![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల వ్యవహారం, ఇతర సమస్యలపై చర్చించడానికి మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం భేటీ కానున్నది. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ భేటీలో మహేశ్బాబు, ప్రభాస్, యస్.యస్. రాజమౌళి, ఆర్. నారాయణమూర్తి, కొరటాల శివ తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం. జగన్తో మహేశ్, ప్రభాస్ సమావేశం కానుండటం ఇదే తొలిసారి.
కొంత కాలంగా ఏపీలో సినిమా టికెట్ ధరలపై వివాదం కొనసాగుతూ వస్తోంది. టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 35ను హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో ప్రభుత్వం జీవో నంబర్ 142ను తీసుకువచ్చింది. గత నెల 13న జగన్ను చిరంజీవి కలిశారు. జగన్ విందుకు ఆహ్వానించడంతో ఆయన ఇంటికి వెళ్లిన చిరు, పనిలో పనిగా సినిమా సమస్యలపై ఆయనతో చర్చించారు. అతి త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇప్పుడు మరోసారి సహ నటులు, దర్శకులతో కలిసి జగన్ను కలవడానికి వెళ్తున్నారు చిరంజీవి. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారు విజయవాడ వెళ్తున్నారు. ఈరోజు జరిపే చర్చలతో ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వివాదానికి శుభం కార్డు పడుతుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ ఇండస్ట్రీకి మేలు జరిగే ప్రకటన ఈరోజు వస్తుందని ఆశిస్తున్నాం. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |