మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్న సంగతి తెలిసిందే. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు బరిలో నిలిచారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా.. తాజాగా మంచు విష్ణు తన ప్యానల్ ను ప్రకటించారు. విష్ణు ప్యానల్ లో సంపూర్ణేష్ బాబుతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఉన్నారు.
'మా కోసం మనమందరం' పేరుతో మంచు విష్ణు తన ప్యానెల్ ను ప్రకటించారు. ఆయన ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబూమోహన్, వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల రవి, పృథ్వీరాజ్, ట్రెజరర్ గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు బరిలో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అర్చన, గీతా సింగ్, సంపూర్ణేష్ బాబు, శ్రీలక్ష్మితో పాటు పలువురు పోటీ పడుతున్నారు.
కాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్, బెనర్జీ, హేమ, జీవిత రాజశేఖర్, నాగినీడు వంటి వారు పోటీ చేస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి బయటకు వచ్చిన బండ్ల గణేష్ మా ఎన్నికల్లో స్వతంత్రంగా జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. ఇక సీవీఎల్ నరసింహారావు సైతం మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయన తన మేనిఫెస్టోను కూడా ప్రకటించడం విశేషం.