టాలీవుడ్ స్టార్స్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు అదే బాటలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నడుస్తున్నాడు.
తక్కువ సినిమాలతోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారపరంగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'రౌడీ' పేరుతో వస్త్ర వ్యాపారంలో రాణిస్తున్నాడు. అలాగే నిర్మాతగా మారి చిన్న సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏషియన్ సినిమాస్తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా అడుగుపెడుతున్నాడు విజయ్. ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో 'ఏషియన్ విజయ్దేవరకొండ(ఏవీడీ) సినిమాస్' మల్టీప్లెక్స్ సెప్టెంబర్ 24న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా విజయ్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్స్టోరీ' సినిమాతో 'ఏవీడీ సినిమాస్' ప్రారంభం కానుంది. తన కెరీర్ శేఖర్ గారి వద్ద మొదలైంది.. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన సినిమాతోనే ఏవీడీ ప్రారంభం కావడం ఆనందంగా ఉందని విజయ్ తెలిపారు. ఏవీడీ ప్రారంభ కార్యక్రమానికి తాను మహబూబ్నగర్లో ఉండాలనుకున్నానని.. కానీ 'లైగర్' మూవీ షూటింగ్ కోసం గోవాలో ఉన్న కారణంగా అక్కడికి రాలేకపోతున్నానని విజయ్ పేర్కొన్నాడు.