ఒక హీరో వదులుకున్న సినిమాను మరో హీరో చేసి విజయాన్ని అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి విజయాన్ని అందుకున్న 'వకీల్ సాబ్' సినిమా విషయంలోనూ అదే జరిగిందని తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ 'పింక్' చిత్రానికి రీమేక్ గా వచ్చిన 'వకీల్ సాబ్' తో పవన్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆఫర్ మొదట నందమూరి బాలకృష్ణకు వెళ్లగా ఆయన రిజెక్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది.
'పింక్' చిత్రాన్ని అప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తమిళ్ లో 'నెర్కొండ పార్వై' పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. దీనిని తెలుగులో తీయాలని భావించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందని అనుకున్నారట. కానీ బాలకృష్ణ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. ఈ క్రమంలో దిల్ రాజు 'నెర్కొండ పార్వై' చిత్రాన్ని త్రివిక్రమ్ దృష్టికి తీసుకెళ్లడం.. అప్పటికే రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న పవన్ కు దాన్ని చూపించడం.. వెంటనే ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయని అంటున్నారు.
అలాగే ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో కూడా మొదట బాలకృష్ణ నటించనున్నారని వార్తలొచ్చాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ రైట్స్ సొంతం చేసుకుంది. అందులో బిజు మీనన్ చేసిన ఎస్ఐ క్యారెక్టర్ బాలకృష్ణ చేస్తాడని, పృథ్వీరాజ్ రోల్ రానా దగ్గుబాటి చేస్తాడనీ అప్పట్లో వార్తలొచ్చాయి. చివరకు ఈ రీమేక్ లో పవన్, రానా చేస్తున్నారు. అలా బాలయ్య వదులుకున్న సినిమాలు పవన్ చేస్తున్నాడంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.