ప్రఖ్యాత వాగ్గేయకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన ఇంట్లో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి అనే గ్రామంలో జన్మించిన ఆయన ఆర్. నారాయణమూర్తి నటించి, దర్శకత్వం వహించిన 'అర్ధరాత్రి స్వతంత్రం' చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. అందులో 'ఏం పిల్లడో ఎల్ద మొస్తవ' పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి వారిని చైతన్యపరిచారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జానపదాలు రచించి గజ్జెకట్టి పాడారు.
1972లో మరో ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్తో కలిసి జననాట్య మండలిని స్థాపించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. మూడున్నర దశాబ్దాల కాలంలో 300కు పైగా జానపద గీతాలు రచించి, ఆడిపాడిన వంగపండుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది అభిమానులున్నారు.