![]() |
![]() |
.webp)
నయనతారతో తనకున్న అనుబంధాన్ని, ఆమె పిల్లలతో తాను గడిపిన సమయాన్ని గురించి మాట్లాడారు తమిళ హాస్య నటుడు సంతానం. ప్రముఖ నటి నయనతారకు, దర్శకుడు విఘ్నేష్ శివన్కు శ్రేయోభిలాషి సంతానం. లేడీ సూపర్ స్టార్తో సంతానం చాలా సినిమాలు చేశారు. సంతానం, నయనతార ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెతో తనకున్న పరిచయాన్ని, అనుబంధాన్ని గురించి మాట్లాడారు సంతానం. ``నాకు చెల్లెలు ఉంటే నయనతారలా ఉంటుందనుకుంటాను. మా ఇంట్లో ఆమెకు మేం ఇచ్చిన స్థానం అదే. ఫస్ట్ టైమ్ ఆమెతో పనిచేసినప్పుడే ఈ విషయాన్ని చెప్పేశాను. ఆమె పిల్లలకు నేను మేనమామ లాంటి వాడిని. అందుకే వెళ్లి చూసొచ్చాను. ట్విన్స్ చూడముచ్చటగా ఉన్నారు. ఆ కుటుంబంతో ఉంటే టైమ్ గడవడమే తెలియలేదు. ఎప్పటికైనా నయనతార కవల పిల్లలకు నేనే చెవులు కుట్టిస్తాను. వాళ్లిద్దరినీ నా ఒళ్లో కూర్చోబెట్టుకుని చెవులు కుట్టిస్తానని నయనతారతోనే చెప్పాను. మీ ఇష్టం అన్నయ్యా అని ఆమె చెప్పినందుకు డబుల్ హ్యాపీ`` అని అన్నారు.
నయనతార - విఘ్నేష్ శివన్కి గత ఏడాది జూన్ 9న పెళ్లయింది. మహాబలిపురంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అనిరుద్ రవిచంద్రన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు. పెళ్లయిన నాలుగు నెలలకే వారిద్దరూ కవల పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చారు. అప్పటి నుంచి ఏ పండగైనా, స్పెషల్ అకేషన్ అయినా పిల్లలతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తున్నారు ఈ దంపతులు.
![]() |
![]() |