![]() |
![]() |

మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'కన్నప్ప'. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో.. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రుద్ర పాత్రలో ప్రభాస్ కనువిందు చేయనున్నాడు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు, వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు భాగం కావడంతో 'కన్నప్ప'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో టీజర్ విడుదలైంది.
'కన్నప్ప' సెకండ్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. 80 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ మెప్పించింది. "గూడేల మీద గండాలు దండెత్తుకొస్తున్నాయి. శత్రువులు యమకింకరులై గూడెం మీద పడబోతున్నారు." అంటూ టీజర్ ప్రారంభమైంది. "వాళ్ళు వేలల్లో కాదు, లక్షల్లో రానివ్వండి తేల్చుకుందాం." అంటూ తిన్నడుగా విష్ణును చూపించిన తీరు బాగుంది. యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. నాస్తికుడైన తిన్నడు, మహా శివ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు అనే ఆసక్తిని రేకెత్తిస్తూ టీజర్ ను రూపొందించారు. ఇక టీజర్ లో రుద్రగా ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ తో టీజర్ ను ముగించిన తీరు కట్టిపడేసింది.
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది.
![]() |
![]() |