Home  »  News  »  ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా : జానీ మాస్టర్

Updated : Jun 24, 2024

కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ స్థాయి పాన్ ఇండియా లెవల్ సినిమాల వరకు వెళ్ళింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా డ్యాన్సర్స్ అభివృద్ధికి పాటు పడుతున్నారు. అయితే... ఇటీవల సతీష్ అనే డ్యాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఒక వీడియో విడుదల చేశారు. అందులో పలు ఆరోపణలు చేశారు. అవి నిజమని నిరూపిస్తే తాను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతానని జానీ మాస్టర్ చెప్పారు. ఈ వివాదం పూర్వాపరాలు వెల్లడించడానికి అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.

TFTDDA అధ్యక్షుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ... ''ఇక్కడ నేను ఓ పార్టీకి, ఓ ప్రాంతానికి సంబందించిన వ్యక్తిగా కాకుండా ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మా యూనియన్ కోసం ఒక ప్రాంతంలో ఐదు కోట్లతో ఒక ల్యాండ్ తీసుకున్నాం. అది సమస్యల్లో చిక్కుకున్నది. జానీ మాస్టర్ ఉంటే పెద్దలతో మాట్లాడి అది తీసుకు వస్తారని, హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారని నమ్మి నన్ను ఎన్నుకున్నారు. నేను అధ్యక్షుడు అయ్యి ఆరు నెలలు అవుతోంది. ఈ సమయంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో రంజాన్ వచ్చింది. ఆ సమయంలో నేను పాటలు వినను. కొరియోగ్రఫీ కూడా చేయను. నెల రోజులు దీక్షలో ఉన్నాను. ఈ ఆరు నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్, ఉపాసన గారితో మాట్లాడాను. యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం. పలు పనులు చేశాం. ఇక, సతీష్ విషయానికి వస్తే... అయేషా గారు చెప్పినవన్నీ నిజాలు. రూల్స్ ప్రకారం కమిటీ, కొరియోగ్రాఫర్లతో మాట్లాడి అతడికి లక్ష రూపాయలు ఫైన్ విధించారు. మా అసోసియేషన్‌లో ఎవరికైనా ఇబ్బంది వస్తే నేను డబ్బులు ఇచ్చాను. ఒకరి పొట్ట కొట్టాలని అనుకోను. సతీష్ గనుక తప్పు అయ్యిందని లెటర్ రాస్తే మొదటి తప్పుగా క్షమించి వదిలేసేవాళ్ళం. ఫైన్ వేసేవాళ్ళం కాదు. నేను ఏంటో చూపిస్తానని కొందరిని బెదిరించారు. ఈ నాలుగు నెలల్లో కొన్ని పాటలు కూడా చేశారు. పైగా నా మీద ఆరోపణలు చేశారు. సతీష్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఒక్కటి నిజమైనా సరే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను ఒక చోట రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ ఛైర్మన్ గా ఉన్నాను. నా వల్ల మా అధినేతకు ఇబ్బంది రాకూడదు. నా తరఫునుంచి తెలంగాణకు ఇబ్బంది రాకూడదు. అందుకే, ఈ ప్రెస్ మీట్ పెట్టాను'' అని చెప్పారు.

TFTDDA ప్రధాన కార్యదర్శి శ్రీను దేవర మాట్లాడుతూ... ''మాది 33 ఏళ్ల చరిత్ర ఉన్న అసోసియేషన్. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బైలాస్ ఉన్నాయి. సంస్థ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలనేది బైలాస్ పుస్తకంలో ఉంది. మా సభ్యుడు జీ సతీష్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంతకు ముందు ఈ విధంగా జరిగింది లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆఫీస్ బేరర్లతో మాట్లాడి పరిష్కార మార్గం చూశాం. అది మా యూనియన్ పద్ధతి. దీన్ని, నియమ నిబంధనలు పక్కన పెట్టి బయటకు వెళ్లి ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. సతీష్ ఆ నిబంధనలను అతిక్రమించారు. మా సంఘంలో జరిగిన కొన్ని విషయాలు స్టేటస్ పెట్టారు. అది వద్దని చెప్పినందుకు అసభ్య పదజాలం వాడారు. తర్వాత కమిటీకి పిలిచినప్పుడు తప్పు చేశానని ఆయన ఒప్పుకొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడితే జరిమానా కట్టి మళ్లీ పని చేసుకోవాలని రూల్స్‌లో ఉంది. కానీ, ఆయన అందుకు అంగీకరించలేదు. జానీ మాస్టర్ కమిటీ వచ్చిన బైలాస్ మార్పులు చేయలేదు. అంతకు ముందు ఉన్నది ఫాలో అవుతున్నాం'' అని చెప్పారు.     

అలీషా మాస్టర్ మాట్లాడుతూ... ''జనరల్ బాడీలో విషయాలను నోటీసు బోర్డులో పెట్టిన తర్వాత ఎవరైనా బయటకు చెప్పాలి. కానీ, అతడు లీక్ చేశాడు. అతని స్టేటస్ జానీ గారికి చూపించాను. ఆయన కమిటీ సభ్యులకు ఫోన్ చేసి తీయమని చెప్పమన్నారు. అప్పుడు అతను జానీ గారికి ఫోన్ చేసి బూతులు తిట్టారు. నా భర్తను తిట్టారని కాదు. ఒక కొరియోగ్రాఫర్, యూనియన్ అధ్యక్షుడిని తిట్టడం కరెక్ట్ కాదు. అందుకని, రెండో రోజు కమిటీ మీటింగ్ పెట్టారు. తప్పు చేశానని సతీష్ ఒప్పుకొని ఫైన్ కట్టడానికి నిరాకరించాడు. గతంలో జానీ మాస్టర్ తప్పు చేయకున్నా ఫైన్ వేస్తే లక్ష కట్టి వర్క్ చేసుకున్నారు. పదేళ్ల క్రితం నాన్ యూనియన్ మెంబర్లను తీసుకుని కొందరు షూటింగ్ చేస్తున్నారని తెలిసి జానీ మాస్టర్‌ వెళ్లి మాట్లాడారు. అందువల్ల 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు. యూనియన్ కోసం, యూనియన్ సభ్యుల కోసం ఆయన ఎప్పుడూ ముందు ఉంటారు. నలుగురికి అన్నం పెట్టె వ్యక్తి మీద సతీష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. జానీ గారికి వ్యతిరేకంగా మాట్లాడమని, ఐదు పది వేలు ఇస్తామని సతీష్ దంపతులు కొందరికి ఫోనులు చేస్తున్నారు. మా యూనియన్ టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది తప్ప తెలంగాణ ఆంధ్ర బేధాలు చూడదు'' అని చెప్పారు. 

TFTDDA ఫౌండర్ సోమరాజు మాట్లాడుతూ... ''చెన్నై నుంచి మద్రాస్ వచ్చినప్పుడు మేం తక్కువ మందితో ఈ అసోసియేషన్ స్థాపించాం. ఇందులో సభ్యులు కొందరు పాన్ ఇండియా స్థాయికి వెళ్లారు. మా సంఘంలో క్రమశిక్షణ ఉంది. ఇప్పుడు కొందరు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడిగా ఈ అసోసియేషన్ కోసం ఏదైనా చేయాలని జానీ మాస్టర్ వచ్చారు. ఆయన అభివృద్ధి చేస్తారనే నమ్మకం మాకు ఉంది'' అని చెప్పారు. 

TFTDDA ఫౌండర్ ఎల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ''మా అసోసియేషన్ స్థాపించి 33 ఏళ్ళు. నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఇక్కడి డ్యాన్సర్లకు వర్క్ వచ్చేలా చేశాం. ఇప్పుడు మన మాస్టర్లు పాన్ ఇండియా స్థాయి సినిమాలకు చేస్తున్నారు. ఈ సంఘాన్ని అభివృద్ధి చేద్దామని జానీ మాస్టర్ వచ్చారు. ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది'' అని అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.