Home  »  News  »  టెలిగ్రామ్‌కు కేంద్రం అల్టిమేటం.. 15 రోజుల్లో పైరసీ ఛానెల్స్ డిలీట్ చేయకపోతే బ్యాన్?

Updated : Jul 4, 2026

సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌(Telegram)కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న అక్రమ కంటెంట్ వ్యాప్తిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్‌లో పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ కంటెంట్ మరియు ఇతర ఆడియో-విజువల్ మెటీరియల్‌ను అక్రమంగా హోస్ట్ చేస్తున్న లేదా షేర్ చేస్తున్న అన్ని గ్రూపులు, ఛానెళ్లను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. 

ఈ పైరసీ కంటెంట్‌ను తొలగించడానికి టెలిగ్రామ్ యాజమాన్యానికి కేవలం 15 రోజుల గడువును విధించింది. ఒకవేళ ఈ 15 రోజుల వ్యవధిలో సదరు అక్రమ కంటెంట్, గ్రూపులను తొలగించడంలో విఫలమైతే, టెలిగ్రామ్ సంస్థపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఈ మేరకు ఐ అండ్ బీ మినిస్ట్రీ ఒక సమగ్రమైన నోటీసును టెలిగ్రామ్‌కు జారీ చేసింది. తాము తీసుకున్న చర్యలపై రాబోయే 15 రోజుల్లోగా సమగ్రమైన 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (ATR) సమర్పించాలని కోరింది. గతంలో కేవలం కొన్ని నిర్దిష్ట లింక్‌లను మాత్రమే బ్లాక్ చేసే విధానం ఉండేదని, అయితే ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి నేరుగా ప్లాట్‌ఫార్మ్ జవాబుదారీతనంపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. 

దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీని, చలనచిత్ర పరిశ్రమను, బ్రాడ్‌కాస్టర్లను, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లను, నిర్మాతలు, పంపిణీదారులను పైరసీ మహమ్మారి నుండి రక్షించేందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల నుండి, కంటెంట్ ఓనర్ల నుండి వచ్చిన లెక్కలేనన్ని ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, పైరసీకి అడ్డాగా మారిన సుమారు 3,142 టెలిగ్రామ్ ఛానెళ్లను ప్రాథమికంగా గుర్తించడం గమనార్హం.

భారతీయ చట్టాల ప్రకారం కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదని, అది కాపీరైట్ యాక్ట్ 1957 & సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 కింద శిక్షార్హమైన క్రిమినల్ నేరమని కేంద్రం గుర్తుచేసింది. ఐటీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం టెలిగ్రామ్ ఒక మధ్యవర్తి ప్లాట్‌ఫార్మ్ అయినందున, తన నెట్‌వర్క్‌లో ఎలాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ షేర్ కాకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత సదరు సంస్థదే అని పేర్కొంది. ప్రభుత్వం లేదా కంటెంట్ ఓనర్లు వచ్చి ప్రతీ లింక్‌ను చూపించే వరకు వేచి చూడకుండా, టెలిగ్రామ్ తన అంతర్గత వ్యవస్థలను బలోపేతం చేసుకుని అక్రమ కంటెంట్‌ను ప్రోయాక్టివ్‌గా గుర్తించి తొలగించాలని ఆదేశించింది. 

ఇప్పటికే ఎగ్జామ్ పేపర్ లీకేజీల వ్యవహారంలో గత నెలలోనే టెలిగ్రామ్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించిన కేంద్రం, ఇప్పుడు పైరసీ విషయంలో మళ్లీ నోటీసులు ఇవ్వడం డిజిటల్ రంగంలో సంచలనంగా మారింది.

 

 

Telegram, Piracy, Central Government, Notice, TeluguOne






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.