![]() |
![]() |

సినిమా అనే పదానికి సరికొత్త వయసుని, వన్నెని తెచ్చిన దర్శకుడు భారతిరాజా(Bharathiraja)ముఖ్యంగా తమిళ సినిమా చరిత్రలో సరికొత్త విప్లవానికి తెరతీసిన లెజెండరీ. గత కొంతకాలంగా వయోభారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
సినిమాని నాలుగు గోడల స్టూడియో సెట్ల నుంచి బయటకు తీసుకువచ్చి, పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ సంస్కృతిని వెండితెరకి పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఇంటర్ క్యాస్ట్ ప్రేమలకి కూడా ఆద్యుడు. ప్రెజెంట్ ఆ ఫార్ములాతో ఇండియా వైడ్ గా ఎవరు సినిమాని తెరకెక్కించినా, భారతి రాజా ఎప్పుడో తెరకెక్కించాడని గుర్తు చేసుకుంటారు. అందుకే సినీ లోకం ఎంతో గౌరవంగా ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకుల శిఖరం) అని పిలుచుకుంటుంది. ఆయన మరణవార్త తెలియగానే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు భారతీరాజా నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.
భారతీరాజా సినీ ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. 1977లో వచ్చిన '16 వాయతినిలే' (తెలుగులో 'పదహారేళ్ళ వయసు') చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కమల్ హాసన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా, సూపర్ స్టార్ రజనీకాంత్ విలన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులని సృష్టించడమే కాకుండా, తమిళ సినిమా గమనాన్నే మార్చేసింది. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్ లో 40 కి పైగా చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించారు. కిళక్కే పోగుం రైల్, సికప్పు రోజాక్కళ్, అలైగళ్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై వంటి క్లాసిక్ చిత్రాలు ఆయన కలం నుండి జాలువారినవే. కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, నటుడిగా కూడా ఆయన రాణించారు.
Also read: Balakrishna: ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే..పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
ఇటీవల ధనుష్ నటించిన బ్లాక్బస్టర్ సినిమా 'తిరుచిత్రాంబలం' (తెరు) మరియు 'మహారాజ' చిత్రాలలో ఆయన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మోహన్లాల్ సరసన నటించిన 'తుడరుమ్' ఆయన చివరి స్క్రీన్ అప్పీయరెన్స్ కాగా, ఇంకా విడుదల కాని 'పులవర్' చిత్రం నటుడిగా ఆయనకు చివరి సినిమా కానుంది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తన కెరీర్ లో 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఒక నంది అవార్డుని కూడా గెలుచుకున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యం. అయితే, గత కొద్ది కాలంగా భారతీరాజా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. మార్చి 2025 లో ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. కుమారుడి మరణం భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మరణంతో భారతీయ సినిమా ఒక గొప్ప దార్శనికుడిని కోల్పోయింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన అమర చిత్రాలు తరతరాల సినీ ప్రేమికులని అలరిస్తూనే ఉంటాయి. తెలుగులో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక మూవీకి ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డుని గెలుచుకుంది. బాలకృష్ణ నుంచి వచ్చిన మంగమ్మగారి మనవడుకి కథని, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ప్లేని అందించారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా వయసు 84 సంవత్సరాలు.
![]() |
![]() |