బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ వచ్చే సంవత్సరం మూడు ఆసక్తికరమైన చిత్రాల్లో కథానాయకుడిగా సందడి చేయనున్నారు. జనవరిలో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్టోరియల్ `పఠాన్`తోనూ, జూన్ లో అట్లీ దర్శకత్వం వహిస్తున్న `జవాన్`తోనూ ఎంటర్టైన్ చేయనున్న షారూక్.. డిసెంబర్ లో రాజ్ కుమార్ హిరాణి రూపొందిస్తున్న `డంకీ`తో వినోదాలు పంచనున్నారు. `పఠాన్`లో షారూక్ కి జోడీగా దీపికా పదుకోణ్ నటించగా.. `జవాన్`లో నయనతార హీరోయిన్ గానూ, `డంకీ`లో తాప్సీ కథానాయికగానూ కనువిందు చేయనున్నారు.
ఇదిలా ఉంటే, అట్లీ దర్శకత్వంలో షారూక్ నటిస్తున్న `జవాన్`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో దీపికా పదుకోణ్, రానా దగ్గుబాటి ప్రత్యేక పాత్రల్లో దర్శనమివ్వనున్నారట. సినిమా సెకండాఫ్ లో ఈ ఇద్దరూ కాసేపు కనిపిస్తారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే `జవాన్`లో దీపిక, రానా ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. `జవాన్`కి దీపికా పదుకోణ్, రానా దగ్గుబాటి ఏ మేరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారో చూడాలి.