'ఆర్య' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన దర్శకత్వ ప్రతిభతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఇటీవల అల్లు అర్జున్ తో చేసిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'తో జాతీయ స్థాయిలో తనపేరు మారుమోగేలా చేశాడు. హిందీలో పుష్ప అంచనాలకు మించి భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో సుకుమార్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సుకుమార్ మాత్రం కోలీవుడ్ స్టార్ సుకుమార్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధనుష్ తెలుగులోనూ నేరుగా సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' తో పాటు, శేఖర్ కమ్ములు ప్రాజెక్ట్ ప్రస్తుతం చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.
సుకుమార్ పుష్ప పార్ట్-2 పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నాడు. వీటి తర్వాత ధనుష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. ఇప్పటికే సుకుమార్ ధనుష్ మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయని అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని న్యూస్ వినిపిస్తోంది.