తెలుగునాట భారీ బడ్జెట్ చిత్రాలకు చిరునామాగా నిలిచే నిర్మాతల్లో సి. అశ్వనీదత్ ఒకరు. ప్రస్తుతం ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఓ పాన్ - వరల్డ్ మూవీని నిర్మిస్తున్నారు. ఆ చిత్రమే.. `ప్రాజెక్ట్ కె`. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ దివా దీపికా పదుకోణ్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నవంబర్ నుంచి 13 నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అంతేకాదు.. 2023 వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుందంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `ప్రాజెక్ట్ కె`కి ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ అయిందట. అశ్వనీదత్ లక్కీ డేట్స్ లో ఒకటైన మే 9ని ఈ సినిమాకి లాక్ చేశారట. `జగదేక వీరుడు - అతిలోక సుందరి`(1990), `మహానటి` (2018), `మహర్షి` (2019) వంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు అశ్వనీదత్ నిర్మాణంలో వచ్చిన మరో చిత్రం `కంత్రి` (2008) కూడా ఇదే మే 9న విడుదలైంది. మరి.. అశ్వనీదత్ కాంపౌండ్ నుంచి మే 9న రాబోతున్న ఐదో చిత్రంగా రికార్డులకెక్కనున్న `ప్రాజెక్ట్ కె` కూడా బ్లాక్ బస్టర్స్ మ్యాజిక్ ని కొనసాగిస్తుందేమో చూడాలి.