`గ్యాంగ్ లీడర్` (2019), `వి` (2020), `టక్ జగదీష్` (2021).. ఇలా వరుస పరాజయాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు నేచురల్ స్టార్ నాని. ఈ నేపథ్యంలో.. రాబోయే `శ్యామ్ సింగ రాయ్`పైనే తన ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ పిరియడ్ డ్రామా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే `శ్యామ్ సింగ రాయ్` రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. `శ్యామ్ సింగ రాయ్`కి నాని రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఒక రకంగా మైనస్ అయినా.. ఇద్దరి క్రేజ్ మాత్రం వరంగా మారింది. ఆ ఇద్దరు మరెవరో కాదు.. చిత్ర కథానాయికలు సాయిపల్లవి, కృతి శెట్టి. `లవ్ స్టోరి`తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన సాయిపల్లవి, `ఉప్పెన`తో డ్రీమ్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి.. `శ్యామ్ సింగ రాయ్`పై ఆసక్తి పెంచుతున్నారు. మరి.. ఆ ఇద్దరి క్రేజ్ `శ్యామ్ సింగ రాయ్`కి ఏ మేరకు ప్లస్సవుతుందో చూడాలి.
కాగా, `శ్యామ్ సింగ రాయ్`లో నాని ఓ బెంగాలీ యువకుడిగా కనిపించనుండగా.. `ప్రేమమ్` ఫేమ్ మడోనా సెబాస్టెయిన్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు.