Home  »  Featured Articles  »  నిర్మాత బంపర్‌ ఆఫర్‌.. వద్దన్న కృష్ణవంశీ.. చివరికి తను అనుకున్నదే చేశాడు!

Updated : Feb 27, 2024

కృష్ణవంశీ.. ఒక విలక్షణ దర్శకుడు. ఒక జోనర్‌కే పరిమితం కాకుండా రకరకాల జోనర్స్‌లో సినిమాలు తీసి మెప్పించగల సత్తా ఉన్న డైరెక్టర్‌. ‘గులాబి’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన కృష్ణవంశీకి విప్లవ భావాలతోపాటు దేశభక్తి కూడా ఎక్కువే. ఇవి ఆయన చేసిన సినిమాల్లో అక్కడక్కడా కనిపిస్తుంటాయి. తన మనసులోని భావాలతో ఒక సినిమా చెయ్యాలనే ఆలోచన అతనికి ఎప్పటి నుంచో ఉంది. గులాబి తర్వాత నిన్నేపెళ్లాడతా చిత్రాన్ని చేసి మరో సూపర్‌హిట్‌ ఇచ్చాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్‌ అవార్డు గెలుచుకుందీ చిత్రం. అలాగే ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకుడుగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాడు కృష్ణవంశీ. 

తను చేయబోయే మూడో చిత్రంలోనే తన భావాలన్నీ బయటపెట్టాలని డిసైడ్‌ అయ్యాడు వంశీ. ‘సిందూరం’ పేరుతో సినిమా స్టార్ట్‌ చేశాడు. రవితేజ, బ్రహ్మాజీ హీరోలు. తన భావాలకు అనుగుణంగా ఆ సినిమాని తెరకెక్కించాడు. కానీ, ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. నిర్మాతకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాని కూడా అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్‌ అవార్డు, ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చెయ్యకుండా 5 సంవత్సరాలు గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో చంద్రలేఖ, సముద్రం, అంత:పురం, మురారి వంటి సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 

2002లో మళ్లీ వంశీలోని విప్లవకారుడు, దేశభక్తుడు మేల్కొన్నాడు. ‘ఖడ్గం’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. సిందూరం చిత్రానికి చేసిన పొరపాటు ఈ చిత్రానికి చెయ్యకూడదనుకున్నాడు. 1990 ప్రాంతంలో ముంబాయిలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సినిమా తియ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వంశీ ‘ఖడ్గం’తో అది నెరవేర్చుకోవాలనుకున్నాడు. దాని కోసం ఎంతో అధ్యయనం చేశాడు. ఉగ్రవాదుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు జైలులో ఉన్న కొందరు ఖైదీలతో చర్చించాడు. ఈసారి తన భావాలతోపాటు కమర్షియాలిటీని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా జోడిరచి పక్కా స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడు. 

ఇక ఇందులోని నటీనటుల ఎంపికలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక ముస్లిం క్యారెక్టర్‌కి ప్రకాశ్‌రాజ్‌, సినిమాల్లో ఒక్క ఛాన్స్‌ కోసం పరితపించే క్యారెక్టర్‌లో రవితేజను ఎంపిక చేసుకున్నాడు. ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ కోసం శ్రీకాంత్‌ని సెలెక్ట్‌ చేసుకున్నాడు. అయితే శ్రీకాంత్‌ను ఆ క్యారెక్టర్‌ కోసం తీసుకోవడం నిర్మాత మధుమురళికి ఇష్టంలేదు. అయినా శ్రీకాంత్‌ను ఆఫీస్‌కి పిలిపించాడు వంశీ. ‘ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌ ఉంది. నిన్ను దాని కోసం తీసుకుందాం అనుకున్నాను. కానీ, మధుకి నిన్ను తీసుకోవడం ఇష్టం లేదు’ అని ఓపెన్‌గా చెప్పేశాడు. అక్కడే ఉన్న మధుమురళి ‘ఇప్పటివరకు మీరు చేసినవి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. మీకు ఈ క్యారెక్టర్‌ సూట్‌ అవ్వదని నా ఒపీనియన్‌’ అని శ్రీకాంత్‌కి చెప్పాడు. కృష్ణవంశీ మాత్రం తన పట్టు వదల్లేదు. దానికి నిర్మాత మధు ‘ఈ సినిమాలో శ్రీకాంత్‌ని తీసుకోకపోతే నీకు రెండు కోట్లు ఇస్తాను’ అని వంశీ ముందు బంపర్‌ ఆఫర్‌ ఉంచాడు. దానికి వంశీ లొంగలేదు. తను అనుకున్నదే చేశాడు. శ్రీకాంత్‌నే ఆ క్యారెక్టర్‌ కోసం తీసుకున్నాడు. సినిమా పూర్తయింది. అద్భుతంగా వచ్చింది. ‘ఖడ్గం’ సినిమాపై ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నాడు వంశీ. సినిమా రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయి అతని నమ్మకాన్ని నిలబెట్టింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు, ఈ సినిమాకి ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాడు కృష్ణవంశీ. 


వినడానికి చాలా చిత్రంగా ఉన్నా.. ఇది వాస్తవం. ఏ హీరోకైనా, ఏ హీరోయిన్‌కైనా వారి తొలి సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా వారి మనసుల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సాధారణంగా కొత్త హీరోకి జంటగా మరో కొత్త హీరోయిన్‌ని తీసుకోవడం జరుగుతుంటుంది. లేదా ఆ హీరో కంటే రెండు మూడు సినిమాలు సీనియర్‌ అయి వుంటుంది. అలా కాకుండా ఆల్రెడీ 100 సినిమాలు పూర్తి చేసిన హీరోయిన్‌తో నటించాల్సి వస్తే.. ఆ అనుభవం ఎలా ఉంటుంది?

ఇది హీరో కృష్ణంరాజు విషయంలో జరిగింది. ఆయన తొలి సినిమా ‘గువ్వా గోరింక’ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అవకాశం కోసం కృష్ణంరాజు రెండు సంవత్సరాలు ఎంతో కృషి చెయ్యాల్సి వచ్చింది. ‘బావామరదళ్ళు’ చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో మద్రాస్‌ రైలెక్కిన కృష్ణంరాజు.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు ప్రత్యగాత్మ అతనికి స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, తాను సొంతంగా నిర్మించే సినిమాలో హీరోగా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చారు. అయితే కృష్ణంరాజుకి అసలు నటనలో ప్రవేశం లేదు, నాటకాలు వేసిన అనుభవం లేదు. తను సినిమా చేసేందుకు కొంత టైమ్‌ పడుతుందని, అప్పటివరకు నాటకాలు వేసి అనుభవం సంపాదించమని సూచించారు ప్రత్యగాత్మ. ఆయన చెప్పినట్టుగానే నాటకాలు వేస్తూ మంచి అనుభవం సంపాదించారు కృష్ణంరాజు. అప్పుడప్పుడు షూటింగ్‌లకు వెళుతూ కెమెరా ముందు ఎలా నటించాలి అనే విషయాల్లో మెళకువలు తెలుసుకున్నారు. 

1965 ఆగస్ట్‌ 6న ప్రత్యగాత్మ తన కొత్త సినిమా ‘గువ్వా గోరింక’ ప్రారంభించారు. కృష్ణంరాజు హీరో, కృష్ణకుమారి హీరోయిన్‌. ఈ కాంబినేషన్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే కృష్ణకుమారి 100 సినిమాలు పూర్తి చేసిన సీనియర్‌ హీరోయిన్‌. అంతకుముందు ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన భార్యాభర్తలు, కులగోత్రాలు చిత్రాల్లో కృష్ణకుమారి హీరోయిన్‌. ఆ సినిమాలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అందుకే కొత్త హీరోతో అయినా నటించేందుకు ఆమె ఒప్పుకున్నారు. తన తొలి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణంరాజుకి నిరాశే ఎదురైంది. ఈ సినిమాలో కళాత్మక ధోరణి, వాపారాత్మక ధోరణి రెండూ ఉండడం వల్ల విజయం సాధించలేదు. అయితే ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందించింది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.