![]() |
![]() |

సల్మాన్ ఖాన్(Salman Khan)కి, వివాదాలకి మధ్య విడదీయరాని అనుబంధం ఉందనుకుంటా. అసలు వివాదం అనే వర్డ్ పుట్టిందే సల్మాన్ కోసం అన్నట్టుగా చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు అదే లెగసి కంటిన్యూ అవుతూ సల్మాన్,ఆయన సోదరి అల్విరా ఖాన్లకు చండీగఢ్ పోలీసులు సమన్లు జారీ చేసిన సంచలన ఉదంతం సినీ పరిశ్రమతో పాటు బిజినెస్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది.
ప్రముఖ ఛారిటీ బ్రాండ్ 'బీయింగ్ హ్యూమన్' (Being Human) పేరుతో జరిగిన కోట్ల రూపాయల మోసం కేసులో ఈ చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. చండీగఢ్కు చెందిన అరుణ్ గుప్తా అనే ప్రముఖ స్థానిక వ్యాపారవేత్త దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న సల్మాన్ ఖాన్, మరోవైపు ఆయన పేరుతో నడుస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ బ్రాండ్ చుట్టూ ఇటువంటి చీటింగ్ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
వివాదం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళ్తే, 2018లో స్థానిక వ్యాపారి అరుణ్ గుప్తా చండీగఢ్లో 'బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ' ఫ్రాంచైజీ స్టోర్ను ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీనికోసం ఆయన సుమారు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయిల వరకు భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. బ్రాండ్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తామని, స్టోర్కు అవసరమైన అన్ని రకాల జ్యువెలరీ సరుకులను ఎప్పటికప్పుడు సరిగ్గా సరఫరా చేస్తామని, అలాగే కంపెనీ తరఫున సంపూర్ణ వ్యాపార మద్దతు అందిస్తామని ప్రతినిధులు ఆయనకి హామీ ఇచ్చారు. అంతేకాకుండా, బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ స్వయంగా వచ్చి ఈ షోరూమ్ను ప్రారంభిస్తారని, ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. ఈ ఆకర్షణీయమైన మాటలు, సల్మాన్ ఖాన్ ఇమేజ్ నమ్మి అరుణ్ గుప్తా భారీగా ధనాన్ని వెచ్చించి షోరూమ్ ఏర్పాటు చేశారు.అయితే, షోరూమ్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంపెనీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో తీవ్రంగా ఆరోపించారు. స్టోర్కు అవసరమైన వస్తువులు, కొత్త డిజైన్లను సరఫరా చేయడంలో కంపెనీ పూర్తిగా విఫలమైంది. అలాగే కంపెనీ వాగ్దానం చేసిన విధంగా సల్మాన్ ఖాన్ షోరూమ్ ప్రారంభోత్సవానికి రాకపోగా, ఆయన బావమరిది ఆయుష్ శర్మ మాత్రమే హాజరయ్యారు.
Also read: శ్రీనివాస మంగాపురం ప్రమోషన్ల లోపం: బాక్సాఫీస్ వసూళ్లని దెబ్బతీసిన పబ్లిసిటీ గ్యాప్!
కంపెనీ ఒప్పందం ప్రకారం ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో వ్యాపారం తీవ్రంగా నష్టపోయింది. దీనికి తోడు, సరుకులు సేకరించడానికి ఉద్దేశించిన కంపెనీ ప్రాంతీయ కార్యాలయం ఫిబ్రవరి 2020 నుంచే శాశ్వతంగా మూతపడి ఉందని గుర్తించారు. దాదాపు 1.5 ఏళ్ల కాలంగా కంపెనీ అధికారులతో పాటు సల్మాన్ ఖాన్కు ప్రత్యక్ష లేఖలు రాసినప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ఈ మోసం వ్యవహారంపై స్పందించిన చండీగఢ్ పోలీసులు సమగ్ర విచారణకు ఆదేశించారు. కేసులో నిజానిజాలను తేల్చడానికి సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈఓతో పాటు లైసెన్సీ సంస్థ 'స్టైల్ కోషియంట్' (Style Quotient) అధికారులతో సహా మొత్తం 8 మందికి జులై 13 లోగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని అధికారిక సమన్లు జారీ చేశారు. ప్రాథమిక విచారణలో ఏదైనా నేరపూరిత కోణం ఉన్నట్లు తేలితే చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చండీగఢ్ ఎస్పీ కేతన్ బన్సల్ స్పష్టం చేశారు. అయితే, ఈ వివాదంపై స్పందించిన 'స్టైల్ కోషియంట్' సంస్థ, బాధితుడితో జరిగిన ఎంవోయూకి సల్మాన్ ఖాన్ లేదా ఆయన సోదరి అల్విరా ఖాన్కు నేరుగా సంబంధం లేదని, వారిపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది. ఏది ఏమైనా, కోట్లాది రూపాయల బిజినెస్ డీల్ దెబ్బతినడంతో బాలీవుడ్ భాయిజాన్ పేరు మరో సారి వివాదాల్లోకి రావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది
Salaman Khan, Alvira Khan, Being Human
![]() |
![]() |