ఆ మాట విని ఉలిక్కిపడ్డ జూనియర్
on Jul 1, 2017
మహానటి సావిత్రి బయోపిక్ అనగానే... దక్షిణాది సినీ ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఆసక్తి నెలకొనడం మామూలే. సావిత్రి మీదుండే అలవిమాలిన అభిమానం ఈ ఆసక్తికి ఓ కారణమైతే... ఆమె కథలో ఉండే సూపర్ స్టార్ల పాత్రలు మరో కారణం. సావిత్రి అనగానే. ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్ర ఎలాగూ ఉంటుంది. ఆయనతో పాటు మన పాత తెలుగు సూపర్ స్టార్లు ఎన్టీయార్, ఏఎన్నార్ల పాత్రలు, తమిళ సూపర్ స్టార్లు ఎమ్జీయార్, శివాజీ గణేశన్ల పాత్రలు ఆ కథలో భాగంగా రావడం ఖాయం. సావిత్రి పాత్రకు కీర్తి సురేశ్ ను తీసుకోవడం, ఆమె షూటింగ్ లో పాల్గొనడం కూడా జరిగిపోయింది. సావిత్రి భర్త జెమినీగణేశన్ గా మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీయార్, ఏఎన్నార్ గా ఎవరు నటిస్తారు? అనేది ఆసక్తిని కలిగిస్తున్న అంశం.
తెలుగు తెరవేల్పు ఎన్టీయార్ పాత్ర చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా 1950, 1960 మధ్య కాలంలో ఎన్టీఆర్ అందం, చురుకుదనాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పాత్రను ఎంపిక చేయాలి. నిజానికి ఇప్పుడున్న ఏ హీరో కూడా ఆయన పాత్ర చేయడటానికి సరితూగరు అనేది నమ్మాల్సిన నిజం. ఎన్టీయార్ పేరు పెట్టుకొని, ఆయన పోలికలు కూడా కలిగిన జూనియర్ ఎన్టీయార్ కాస్తో కూస్తో మహానటుడు ఎన్టీయార్ పాత్రకు న్యాయం చేయగలరని పలువురి అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే... ఆ చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఈ మథ్య తారక్ ని కలిశారట. విషయం విన్న తారక్ ఉలిక్కిపడి, నాకంత సీన్ లేదని చెప్పేశారట. అయితే... అశ్వనీదత్, ఆయన కుమార్తె స్వప్న దత్లు మాత్రం ఆ పాత్రను తారక్ తోనే చేయించాలని గట్టి పట్టుమీద ఉన్నారు.
ఇక మరో మహానటుడు అక్కినేని పాత్ర విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఈ విషయంలో ఏఎన్నార్ మనవడు నాగచైతన్యకే వాళ్లు ఓటు వేశారు. అందుకే... ఎన్టీయార్, ఏఎన్నార్ సీన్లు మినహా మిగిలిన పార్టంతా పూర్తి చేస్తున్నారట దర్శకుడు నాగ అశ్విన్. ఎలాగైనా తారక్ ని ఒప్పిస్తే, నాగచైతన్య ఈజీగానే ఓకే అంటాడని వారి అభిప్రాయంగా తెలిసింది. ఇప్పటికే సమంత, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఇందులో బహుముఖ ప్రజ్ణాశాలి భానుమతి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో మాస్ ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరోయిన్ కనిపించనున్నారు. ప్రస్తుతానికి అది సస్పెన్స్.