
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!
- ఆగిపోయిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్?
- డైరెక్టర్ తో విభేదాలే కారణమా?
టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం ఒక వార్త సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ 'AA23' ఆగిపోయే ప్రమాదం ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా అనౌన్స్ చేసిన ఈ క్రేజీ కాంబినేషన్, షూటింగ్ దశకు చేరకముందే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న లీకులు ఇరు హీరో, దర్శకుల అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్.. ప్రకటన వచ్చిన రోజున సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన '23 థీమ్' మ్యూజిక్ ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండ్ అయి రికార్డు సృష్టించింది. అంతగా అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు అటకెక్కనుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మధ్య తలెత్తిన కొన్ని అభిప్రాయ బేధాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. కథా చర్చల సమయంలో ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉండటం, క్యారెక్టరైజేషన్ విషయంలో ఇద్దరి మధ్య ఒక స్పష్టమైన అవగాహన కుదరకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
2026 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
రాబోయే రోజుల్లో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ ల మధ్య ఉన్న ఈ విభేదాలు సద్దుమణిగి, చర్చలు సఫలం కాకపోతే ఈ బిగ్గెస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అధికారికంగా షెల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ వార్తలపై ఇటు మైత్రీ మూవీ మేకర్స్ కానీ, అటు హీరో, దర్శకులు కానీ స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ సస్పెన్స్కు తెరపడదు.





