(జూలై 16 వి.రామకృష్ణ వర్థంతి సందర్భంగా..)
తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న అమర గాయకుడు విస్సంరాజు రామకృష్ణదాసు (వి.రామకృష్ణ). జులై 16 ఆయన వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుందాం. 1970వ దశకంలో తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి నేపథ్య గాయకుడిగా వెలిగిన రామకృష్ణ, తన సుమధుర గాత్రంతో కోట్లాదిమంది సంప్రదాయ, సినీ సంగీత ప్రియుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు స్ఫూర్తితో సినీ రంగ ప్రవేశం చేసి, ఆయనకు తగిన వారసుడిగా, 'అపర ఘంటసాల'గా కీర్తి గడించడం రామకృష్ణ ప్రత్యేకత.
వి.రామకృష్ణ 1947, ఆగష్టు 20న విజయనగరంలో రంగసాయి, రత్నం దంపతులకు జన్మించారు. ఆయనకు సంగీతం పుట్టుకతోనే అబ్బిందని చెప్పవచ్చు. ప్రముఖ గాయని పి. సుశీల ఈయనకు మేనత్త కావడం విశేషం. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి వద్ద ఆయన శాస్త్రీయ సంగీతంలోని మెళకువలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆకాశవాణిలోని 'యువవాణి' కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు చిత్తరంజన్ పర్యవేక్షణలో లలిత గీతాలను ఆలపించడం ద్వారా ఆయన తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన తన సినీ జీవితంలో రామకృష్ణ 200లకు పైగా చిత్రాలలో 5000కు పైగా మధురమైన పాటలను ఆలపించారు. నాటి అగ్ర నటులైన నటరత్న ఎన్టీ రామారావు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి మహామహుల నటనకు తన గొంతుతో ప్రాణం పోశారు. అదేవిధంగా కె.వి.మహదేవన్, పెండ్యాల, సత్యం, ఎస్.రాజేశ్వరరావు వంటి దిగ్గజ సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో క్లాసిక్ గీతాలను అందించారు.
ఆయన పాడిన తాతామనవడు, భక్తతుకారాం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, దానవీరశూర కర్ణ, మహాకవి క్షేత్రయ్య, అమరదీపం, బలిపీఠం, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీషిర్డీసాయిబాబా మహత్మ్యం వంటి చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. సినిమా పాటలతో పాటు ఆయన పాడిన భక్తిగీతాల ఆల్బమ్లు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందాయి. నాటి తెలుగు చిత్రసీమ మద్రాసు నుండి హైదరాబాద్కు తరలివచ్చిన క్రమంలో రామకృష్ణ కూడా హైదరాబాద్కు మారి, జూబ్లీహిల్స్లోని వెంకటగిరి కాలనీలో స్థిరపడ్డారు.
1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చి, దూరదర్శన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2001లో విడుదలైన 'నువ్వే కావాలి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యువ నటుడు సాయి కిరణ్ వీరి కుమారుడే కావడం గమనార్హం. అలాగే వీరి కుమార్తె లేఖ కూడా సినీరంగంలో తన అడుగులు వేస్తున్నారు.
సంగీత ప్రియులను అలరించిన ఆ మధుర స్వరం కొంతకాలం పాటు క్యాన్సర్ వ్యాధితో పోరాడి, 2015 జూలై 16న హైదరాబాద్లోని తన నివాసంలో శాశ్వతంగా మూగబోయింది. రామకృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలపించిన అమర గీతాలు, భక్తి సంకీర్తనలు తెలుగు వారి గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. తెలుగు సంగీతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.




