Home

»

Featured News

ఎస్వీ రంగారావు మరణం తర్వాత ఆ 24 గంటలు ఏం జరిగింది? భార్య లీలావతి ఎందుక‌లా చేశారు?

May 20, 2026

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు, విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు. వెండితెరపై ఆయన చూపించిన రాజసం, పలికించిన హావభావాలు ఇప్పటికీ అజరామరం. అయితే, అంతటి గొప్ప నటుడి జీవిత చరమాంకం, ముఖ్యంగా ఆయన కన్నుమూసిన తర్వాత చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు వింటే ఇప్పటికీ సినీ అభిమానుల గుండెలు తరుక్కుపోతాయి.

ఆయన మరణించి దశాబ్దాలు గడుస్తున్నా ఎస్వీఆర్ నట వారసత్వం నేటికీ సజీవంగానే ఉంది. ‘నర్తనశాల’ చిత్రంలో కీచకుడిగా ఆయన చేసిన నటనకు జకార్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. అంతటి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఏకైక భారతీయ నటుడు ఆయనే కావడం విశేషం. తెరపై ఎంత గంభీరంగా కనిపించినా, నిజ జీవితంలో ఎస్వీఆర్ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారని ఇండస్ట్రీ పెద్దలు చెబుతుంటారు.

అయితే, చివరి రోజుల్లో ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో షూటింగ్ సమయంలోనే గుండెపోటు రావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు విశ్రాంతి తీసుకోమని హెచ్చరించినా, ‘యశోద కృష్ణ’ సినిమాలో కంసుడి పాత్రను పూర్తి చేయాలనే పట్టుదలతో ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే అమెరికా వెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకుంటానని పిల్లలకు మాట ఇచ్చారు. కానీ విధి విచిత్రమైనది, ఆ సమయం ఆయనకు దక్కలేదు.

1974 జూలై 18వ తేదీన ఎస్వీ రంగారావు ఇంట్లోనే మధ్యాహ్నం భోజనం ముగించి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం వేళ నిద్రలేచిన తర్వాత ఇంట్లో కొంత గందరగోళం నెలకొంది. ఆ మానసిక ఒత్తిడిలో ఆయన బాత్‌రూమ్‌లోకి వెళ్లి మద్యం సేవించి, బయటకు వచ్చి బట్టలు మార్చుకునే క్రమంలో మంచంపై కుప్పకూలిపోయారు. అది ఆయన ఆఖరి శ్వాస అని తెలిసి ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

రామానాయుడు వంటి ప్రముఖులు వెంటనే ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ, అక్కడ అందరికీ ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. ఎస్వీఆర్ సతీమణి లీలావతికి ఆధ్యాత్మిక చింతన, పూజలపై విపరీతమైన నమ్మకం ఉండేది. తన గురువుగారికి చనిపోయిన వారిని బతికించే శక్తులు ఉన్నాయని ఆమె బలంగా నమ్మారు. ఆ గురువు పాండిచ్చేరిలో ఉండటంతో, ఆయన వస్తే తన భర్త మళ్లీ లేచి కూర్చుంటారనే భ్రమలో ఆమె దాదాపు 24 గంటల పాటు ఎవ్వరినీ భౌతికకాయాన్ని చూడనివ్వలేదు.

చివరకు గురువుగారితో ఫోన్ సంప్రదింపులు సాధ్యం కాకపోవడంతో, వాస్తవాన్ని గ్రహించి ఎస్వీఆర్ పార్థివ దేహాన్ని కిందికి తీసుకువచ్చేందుకు అంగీకరించారు. ఆ తర్వాత చెన్నైలోని కన్నిమ్మపేట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో శివాజీ గణేషన్, వాణిశ్రీ వంటి దిగ్గజాలు ఆయనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

తెలుగు సినిమా చరిత్రలో ఎస్వీ రంగారావు లాంటి నటుడు మళ్లీ పుట్టలేరనేది నగ్నసత్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఘటోత్కచుడిగా, రావణాసురుడిగా, కంసుడిగా ఆయన పోషించిన అమర పాత్రలు నేటికీ, రేపటికీ రాబోయే తరాలకు నటనకు ఒక నిఘంటువులా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com