Home

»

Featured News

ఒక్క స్టార్ హీరో కూడా లేని రావుగోపాల‌రావు అంతిమ‌యాత్ర‌.. ఎందుక‌లా చేశారు?

Mar 30, 2026

తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది గొప్ప న‌టులు వున్నారు. వారిలో రావుగోపాల‌రావు ప్ర‌త్యేకం అని చెప్పాలి.  తన విలక్షణమైన గొంతుతో, డైలాగ్ డెలివరీతో విలనిజానికే కొత్త అర్థం చెప్పారు. తెరపై గంభీరంగా కనిపించే ఈ మహానటుడి వ్యక్తిగత జీవితం మరియు ఆయన చివరి రోజులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన భార్య కమల కుమారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రావుగోపాలరావు షూటింగ్ సమయంలో చాలా క్రమశిక్షణతో ఉండేవారు. పని పట్ల ఆయనకు ఉన్న గౌరవం అపారం. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం ఇచ్చేవారు. ఆయన ఆహారపు అలవాట్లు కూడా చాలా సాదాసీదాగా ఉండేవి. బయట ఎంత పెద్ద స్టార్ అయినా ఇంట్లో మాత్రం చాలా సరళంగా ఉండేవారని ఆమె తెలిపారు.

రావుగోపాల‌రావుకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండేవని, చివరి రోజుల్లో అవి తీవ్రమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన తన వృత్తి పట్ల ఉన్న మక్కువతో పనులను కొనసాగించే ప్రయత్నం చేసేవారు. చివరికి ఆ అనారోగ్యమే 1994 ఆగస్టు 13న ఆయనను మనకు దూరం చేసింది.

రావుగోపాలరావు చనిపోయిన సమయంలో ఆయన అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో కూడా హాజరు కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ హీరోలు రాకపోవడం తమను ఎంతో బాధించింది అన్నారు. అంతేకాదు, ఒక్క నిర్మాత కూడా అంతిమ యాత్రలో లేరు. అల్లు రామలింగయ్య, పి.ఎల్. నారాయణ, రేలంగి నరసింహారావు వంటి కొందరు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అంతటి మహానటుడికి జరగాల్సిన గౌరవం ఆ సమయంలో సరిగ్గా జరగలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు శాశ్వతం. తరం మారినా రావుగోపాల‌రావు డైలాగులు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆయన భార్య పంచుకున్న ఈ విషయాలు ఆ మహానటుడి జీవితం వెనుక ఉన్న మరో కోణాన్ని మనకు తెలియజేస్తోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com