ENGLISH | TELUGU  

9 నెలల్లోనే అధికారంలోకి రావడం వెనుక ఎన్టీఆర్‌ చేసిన నిస్వార్థ సేవ ఇదే!

on May 10, 2025

వెండితెరపై తన అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటరత్న ఎన్‌.టి.రామారావు ఆ తర్వాత జనం మెచ్చిన నాయకుడిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఒక నటుడిగా కాకుండా, దైవంగా భావించి తమ ప్రేమాభిమానాలను ఎన్టీఆర్‌పై చూపించేవారు ప్రజలు. తెలుగు చిత్ర సీమలో తిరుగునేని కథానాయకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న ఆయన.. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే అంతటి ప్రజాదరణ కేవలం సినిమాల ద్వారానే రాలేదు. అధికారంలోకి రావడానికి ఎన్నో ఏళ్ళ క్రితమే తన సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌. తన తోటి కళాకారులలో స్ఫూర్తిని నింపి ప్రత్యక్షంగా ప్రజలను కలిసి విరాళాలు సేకరించారు. 

1965లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య తొలి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా రెండు దేశాలకూ నష్టం వాటిల్లుతుంది. ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొదట నటరత్న ఎన్‌.టి.రామారావు స్పందించారు. జాతీయ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరిస్తామని పత్రికాముఖంగా ప్రకటించారు. తన సహ నటీనటుల్లో స్ఫూర్తిని నింపారు. తను ముందు ఉండి అందర్నీ సేవా కార్యక్రమాల వైపు నడిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజాక్షణ కమిటీ సహాయంతో 1965 మే 16, 17, 18 తేదీల్లో విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు పట్టణాల్లో వినోద కార్యక్రమాలు నిర్వహించి భారీగా విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ సారధ్యం వహించారు. తమ అభిమాన తారలను ప్రత్యక్షంగా చూసి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దేశం కోసం సినిమా తారలు చేస్తున్న విరాళాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు తమ పూర్తి మద్దతు తెలియజేస్తూ.. ఉదారంగా విరాళాలు అందించారు. 

ఎంతో ఉత్సాహభరితంగా సాగిన వినోద కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌తోపాటు ఎన్టీఆర్‌తో పాటు ఆరోజుల్లో వెండితెరపై నటీనటులుగా వెలిగిపోతున్న ఎస్‌.వి.రంగారావు, జగ్గయ్య, కాంతారావు, గుమ్మడి, రాజనాల, రేలంగి, సత్యనారాయణ, పద్మనాభం, సావిత్రి, జమున, రాజసులోచన, కన్నాంబ, లక్ష్మీరాజ్యం, గిరిజ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. మూడు పట్టణాల్లో ప్రదర్శించిన వినోద కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఎంతో అలరించాయి. తన తోటి నటీనటుల్లోనే కాదు, ప్రజల్లో కూడా స్ఫూర్తిని నింపి వారిని చైతన్యవంతుల్ని చేశారు ఎన్టీఆర్‌. దాంతో ప్రజలు విరివిగా తమ విరాళాలను ఎన్టీఆర్‌ బృందానికి అందించారు. తమ కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.8 లక్షలు సేకరించి నాటి ప్రధాన మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రికి అందజేశారు ఎన్టీఆర్‌. 

ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా అన్న ఎన్టీఆర్‌ ముందుకొస్తారు, ఆదుకుంటారు అనే నమ్మకాన్ని ఆరోజుల్లోనే ప్రజల్లో కలిగించారు. దేశ రక్షణ నిధికి విరాళాలు సేకరించిన స్ఫూర్తితోనే 1969లో తుపాను బాధితుల కోసం వారం రోజులపాటు తోటీ నటీనటులతో కలిసి భిక్షా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో నటీనటులు, ఇతరులు కలికి మొత్తం 180 మంది పాల్గొన్నారు. వారందర్నీ ముందు ఉండి నడిపించిన ఎన్టీఆర్‌లో గొప్ప నాయకుడు ఉన్నాడనే విషయాన్ని ఆరోజుల్లోనే ప్రజలు గుర్తించారు. ఆ తర్వాత మరోసారి 1977లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. దివిసీమ ఉప్పెనవల్ల రాష్ట్రంలో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఉప్పెన వల్ల అన్నీ కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు మరోసారి నడుం కట్టారు ఎన్టీఆర్‌. చిత్ర పరిశ్రమలో సోదరులుగా మెలిగే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి జనంలోకి నడిచారు. పలు నగరాల్లో వినోద ప్రదర్శనలు ఇచ్చి రూ.15 లక్షలు సేకరించారు. ఆ మొత్తాన్ని అప్పటి ప్రభుత్వానికి అందజేశారు ఎన్టీఆర్‌. ప్రజలకు రాష్ట్రంలో ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా నేనున్నానంటూ ముందుకు వచ్చి తన తోటి నటీనటులను కూడా సేవా మార్గంలో నడిపిన ఎన్‌.టి.రామారావు తమ భవిష్యత్‌ నాయకుడు అని ఆరోజుల్లోనే ప్రజల మనసుల్లో స్థిరపడిపోయిందని చెప్పడానికి ఆయన చేసిన సేవా కార్యక్రమాలే నిదర్శనం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.