బాలీవుడ్ నటి షమితా శెట్టి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక అత్యంత బాధాకరమైన ఆరోగ్య సమస్యను గురించి ఓపెన్గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. మహిళల్లో సైలెంట్గా విస్తరిస్తున్న 'ఎండోమెట్రియోసిస్' అనే దీర్ఘకాలిక వ్యాధితో తాను ఎంతగానో నరకం చూశానని ఆమె వెల్లడించింది. 2024 మే నెలలో ఈ తీవ్రమైన సమస్యకు శస్త్రచికిత్స (సర్జరీ) చేయించుకున్న షమిత, తాజాగా ప్రముఖ నటి సోహా అలీ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన 'ఆల్ అబౌట్ హర్' పాడ్కాస్ట్లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ వ్యాధి బారిన పడినప్పుడు తనకు ఎదురైన ఒక విచిత్రమైన అనుభవాన్ని, ఒక డాక్టర్ ఇచ్చిన సలహాను గుర్తుచేసుకుంటూ షమితా శెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆమె ఆ కష్టకాలంలో ఒక వైద్యుడిని సంప్రదించినప్పుడు, ఆ డాక్టర్ తనకు “ఓ బిడ్డను కను.. అదే ఎండోమెట్రియోసిస్కు నివారణి” అని వింతైన సలహా ఇచ్చాడట. ప్రస్తుతం 47 ఏళ్ల వయసున్న షమితా శెట్టి ఇప్పటికీ అవివాహితగానే జీవిస్తోంది. ఆ డాక్టర్ సలహా వినగానే ఒక్కసారిగా షాక్కు గురైన షమిత, వెంటనే సమయస్ఫూర్తితో స్పందిస్తూ... “బానే ఉంది సార్.. కానీ బేబీని పుట్టించేందుకు మనిషిని నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి?” అని సరదాగా, కాస్త వ్యంగ్యంగా అడిగానని నవ్వుతూ వెల్లడించింది. పెళ్లి కాకుండా, భాగస్వామి లేకుండా బిడ్డను కనడం ఎలా సాధ్యమనే లాజిక్ను పక్కన పెట్టి వైద్యులు ఇలాంటి సలహాలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది.
అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి అనే విషయంపై కూడా ఈ పాడ్కాస్ట్లో వైద్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా గర్భాశయం లోపల ఉండే లైనింగ్ లాంటి కణజాలం (టిష్యూ), గర్భాశయం వెలుపల ఇతర భాగాలలో పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, ఇన్ఫ్లమేషన్, మరియు స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. భారతదేశంలో సుమారు 40 శాతం మహిళలు ఈ భయంకరమైన సమస్యతో ఎదో ఒక దశలో బాధపడుతున్నారని, అయితే చాలా మందికి దీని గురించి కనీస అవగాహన కూడా లేదని షమితా శెట్టి ఆందోళన వ్యక్తం చేసింది. 40 శాతం అనే ఈ గణాంకాలు నిజంగా చాలా ఆందోళనకరమైన విషయమని ఆమె హెచ్చరించింది.
ఈ పాడ్కాస్ట్లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీటా వార్టీ మాట్లాడుతూ, గర్భం దాల్చడం వల్ల మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ లెవెల్స్ తగ్గి ఎండోమెట్రియోసిస్ నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం కలగవచ్చని, కానీ ఇది ఎంతమాత్రం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఎండోమెట్రియోసిస్ సమస్య మహిళల్లో ఫెర్టిలిటీని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, దీనివల్ల ఓవరీలపై చాక్లెట్ సిస్టులు ఏర్పడి, లోపల ఉండే గుడ్ల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుందని డాక్టర్ వివరించారు. అందుకే, మహిళలు తమ శరీరం ఇచ్చే చిన్నపాటి సిగ్నల్స్ను కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని, పీరియడ్స్ సమయంలో అసాధారణమైన నొప్పి ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని షమితా శెట్టి మహిళా లోకానికి పిలుపునిచ్చింది.
Shamita Shetty, Endometriosis Pain, Soha Ali Khan




