దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. హిందీలో తొలి సినిమా విడుదల కాకముందే అక్కడ అగ్ర హీరోల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యి ఆమెకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
సాయి పల్లవి ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన 'ఏక్ దిన్' అనే చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె ప్రతిభను చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయిందట. ఇక రీసెంట్గా ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఆమిర్ ఖాన్, సాయి పల్లవి నటనకు ముగ్ధుడయ్యారు. ఆమెను భారతీయ సినీ పరిశ్రమలోని ఉత్తమ నటీమణులలో ఒకరిగా ఆయన కొనియాడడమే కాకుండా, ఆమె అభినయానికి భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.
సాయి పల్లవి టాలెంట్పై నమ్మకంతో ఆమిర్ ఖాన్ తన తదుపరి భారీ ప్రాజెక్టులో ఆమెకు ఒక కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆమిర్ ఖాన్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఆయనే స్వయంగా ఒక నటిని ఎంచుకున్నారంటే, ఆ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సాయి పల్లవి కూడా సానుకూలంగా స్పందించినట్లు బి-టౌన్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక 'రామాయణ్' చిత్రంలో ఆమె సీత పాత్రను పోషిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు 'రామాయణం', మరోవైపు అమీర్ ఖాన్ వంటి లెజెండ్స్ నుంచి వస్తున్న అవకాశాలతో సాయి పల్లవి పేరు ఇప్పుడు బాలీవుడ్లో మారుమ్రోగిపోతోంది. ఉత్తరాది మార్కెట్లో కూడా తన జెండా పాతేందుకు ఈ "హైబ్రిడ్ పిల్ల" సిద్ధమవుతోంది.




