
బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ప్రీతి జింటా (Preity Zinta) త్వరలోనే వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వైబ్’ (Vibe). నటుడు, దర్శకుడు కునాల్ ఖేము దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఎనర్జీ యాక్షన్-కామెడీ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రీతి జింటా మళ్లీ బాలీవుడ్లో తన మ్యాజిక్ను రిపీట్ చేయాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అమెజాన్ MGM స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 18న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ప్రైమ్ వీడియో యొక్క 2026 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ జాబితాలో ఈ సినిమాను మొదట ప్రకటించినప్పటికీ, దీనిని థియేట్రికల్ రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. థియేటర్లలో రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది.
ఈ సినిమాకు కునాల్ ఖేము కేవలం దర్శకుడిగానే కాకుండా స్వయంగా కథను అందిస్తూ, ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. 'వైబ్' చిత్రం ఇద్దరు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. చాలా సాదాసీదాగా సాగిపోయే వారి జీవితాలు, ఊహించని విధంగా ఒక ప్రమాదకరమైన ఉగ్రవాద కుట్రలో చిక్కుకోవడంతో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది ఈ సినిమా కథాంశం. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోకి వెళ్లినప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు ఎలా గట్టెక్కారు అనే విషయాన్ని ఎంతో వినోదాత్మకంగా చూపించబోతున్నారు.
ప్రీతి జింటా, కునాల్ ఖేములతో పాటు ఈ చిత్రంలో 'లాపాతా లేడీస్' ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే వంశికా ధీర్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రముఖ నటులు యశ్పాల్ శర్మ, దినేష్ లాల్ యాదవ్ (నిరహువా) ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డాంగో ఫిల్మ్స్ బ్యానర్పై కునాల్ ఖేము, చిరాగ్ నిహలాని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చివరిగా 2018లో వచ్చిన ‘భయ్యాజీ సూపర్హిట్’ చిత్రంలో కనిపించిన ప్రీతి జింటా, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. సన్నీ డియోల్తో ఆమె నటిస్తున్న 'లాహోర్ 1947' చిత్రం కూడా త్వరలోనే విడుదల కానుంది. ఒకే సమయంలో వస్తున్న ప్రీతి జింటా కమ్బ్యాక్ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.





