Home

»

Bollywood News

ఆ వార్తల్లో నిజం లేదు.. కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు!

Mar 24, 2026

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘కపూర్’ ఖాందాన్ గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా లెజెండరీ నటుడు రాజ్ కపూర్ నిర్మించిన 'ఆర్కే స్టూడియో' ఒక కాలంలో బాలీవుడ్ చిత్రాలకు చిరునామాగా ఉండేది. అయితే, గత కొన్నాళ్లుగా ఈ ఐకానిక్ స్టూడియోను మళ్ళీ పునఃప్రారంభించ బోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్లపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని తేల్చి చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.

ఆర్కే స్టూడియోస్ పునరాగమనం గురించి కరీనా మాట్లాడుతూ.. "ఈ వార్త వినడానికి చాలా బాగుంది కానీ, ఇందులో వాస్తవం లేదు. మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో కూడా దీనిపై చర్చ జరిగింది. అందరూ ముక్తకంఠంతో ఇది జరగడం లేదని స్పష్టం చేశారు. జనాలు ఆర్కే స్టూడియో మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు, కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవు" అని బెబో స్పష్టం చేశారు. ముఖ్యంగా తన సోదరుడు రణబీర్ కపూర్ దీనిని టేకోవర్ చేస్తాడని వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు.

రణబీర్ కపూర్ ప్రస్తుతం తన నటనపైనే పూర్తి దృష్టి సారించాడని కరీనా చెప్పుకొచ్చారు. "రణబీర్ ఒక అద్భుతమైన నటుడు. ప్రస్తుతానికి అతను కేవలం తన పాత్రలు, సినిమాల గురించే ఆలోచిస్తున్నాడు. ప్రొడక్షన్ లేదా స్టూడియో నిర్వహణ వంటి బాధ్యతలు తీసుకోవడానికి అతను సిద్ధంగా లేడు. ఇది వినడానికి కొంచెం బాధగా అనిపించినా ఇదే నిజం. ఒకవేళ ఆర్కే స్టూడియోస్ మళ్ళీ మొదలవ్వాలంటే అది లోలో (కరిష్మా కపూర్) లేదా రణబీర్ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్షన్ లేదా ప్రొడక్షన్ ఆలోచనలు పెద్దగా లేవు" అని కరీనా మనసులో మాట బయటపెట్టారు.

ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 1948లో రాజ్ కపూర్ ఈ స్టూడియోను నిర్మించారు. ఆవామ్, శ్రీ 420, బాబీ వంటి క్లాసిక్ సినిమాలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. అయితే, 2017లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో స్టూడియోలోని అధిక భాగం కాలిపోయింది. ఆ తర్వాత స్టూడియో నిర్వహణ భారంగా మారడంతో కపూర్ కుటుంబం దానిని 2019లో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించింది. అప్పటి నుండి ఈ లెజెండరీ బ్యానర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం కరీనా కపూర్ తన కెరీర్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవలే 'సింగం అగైన్' చిత్రంతో పలకరించిన ఆమె, త్వరలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో 'దాయరా' అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. ఇందులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఓటీటీలో ఒక మినీ సిరీస్ చేయాలని ఉందంటూ తన కోరికను బయట పెట్టారు. ఆర్కే స్టూడియోస్ రీఎంట్రీ వార్తలకు బ్రేక్ పడినా, కపూర్ వారసులు తమ నటనతో మాత్రం రాజ్ కపూర్ వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పక తప్పదు

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com