బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కలయికలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్’ డిజిటల్ వేదికలపై సరికొత్త సంచలనాలకు సిద్ధమైంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సినీ ప్రియులకు ఒక ఊహించని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ బ్లాక్బస్టర్ చిత్రం మొదటి భాగానికి సంబంధించిన సరికొత్త ‘రా అండ్ ఉండేఖా’ (అన్కట్) వెర్షన్ను ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ అన్కట్ వెర్షన్ను కేవలం ఒకే ఒక్క డిజిటల్ ప్లాట్ఫామ్కు పరిమితం చేయకుండా, ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలలో విడుదల చేస్తుండటం విశేషం. ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు ‘నెట్ఫ్లిక్స్’ మరియు ‘జియో హాట్స్టార్’ వేదికలుగా మే 22 నుంచి ఈ ప్రత్యేక ఎడిషన్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడని పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో దాదాపు 3 గంటల 25 నిమిషాల సుదీర్ఘ రన్టైమ్తో ఈ అన్కట్ వెర్షన్ అలరించబోతోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం (Dhurandhar 2) ఓవర్సీస్ మార్కెట్లో డిజిటల్ రిలీజ్ అయి భారీ వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే మొదటి పార్ట్ రా వెర్షన్ను విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇక భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ధురంధర్’ సెకండ్ పార్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు కూడా ఖరారయ్యాయి.
జూన్ 4వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ‘ధురంధర్ 2’ జియో హాట్స్టార్ ద్వారా మనదేశంలో అందుబాటులోకి రానుంది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. విదేశాల్లో ఉన్న సినిమా అభిమానులు మాత్రం ఈ పార్ట్-2ను నెట్ఫ్లిక్స్ వేదికగా వీక్షించవచ్చు. డిజిటల్ స్క్రీన్స్పై మరింత వినోదాన్ని పంచేందుకు ఓటీటీ వెర్షన్లో అదనంగా కొన్ని కీలక సీన్లను కూడా జోడించారు. థియేట్రికల్ రన్ 3 గంటల 49 నిమిషాలు ఉండగా, ఈ ఓటీటీ రన్టైమ్ 3 గంటల 52 నిమిషాలుగా ఉండటం విశేషం.
ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే మైల్స్టోన్గా నిలిచిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ మాసివ్ యాక్షన్ డ్రామా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఎలాంటి వ్యూస్ సాధిస్తుందో చూడాలి.




