English | Telugu
ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చెయ్యాలి!
Updated : Nov 18, 2025
చిత్ర పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ వెబ్సైట్ను ఎట్టకేలకు క్లోజ్ చేయించారు పోలీసులు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపేందుకు చిత్ర ప్రముఖులు ఫిలిం ఛాంబర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్భూషణ్, నిర్మాతలు సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్, వల్లభనేని అనిల్ కుమార్, బాపిరాజు, వీరశంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘దేశం మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పైరసీ సెల్ను మెయిన్టెయిన్ చేస్తోంది. ఈ పైరసీని అరికట్టేందుకు మన పోలీసులతోపాటు విదేశీ పోలీసులు కూడా సహకారం అందించారు. ఎంతో కష్టపడి ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిశ్రమకు ఇంత నష్టం కలిగించిన రవిని ఎన్కౌంటర్ చెయ్యాలి. ఇది కడుపు మంటతో అంటున్న మాట. ప్రేక్షకులకు పైరసీ గురించి మరింత అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. దాని వల్ల చిత్ర పరిశ్రమకు ఎంత నష్టం జరుగుతుందీ అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలి’ అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘టికెట్ ధరలు ఎక్కువ ఉండడం వల్ల పైరసీలో సినిమాలు చూస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ, దీని వల్ల చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. క్యూబ్, యుఎఫ్ఓ ద్వారానే పైరసీ అనేది బయటికి వస్తోంది అనే విషయం అర్థమవుతోంది. కాబట్టి ఆయా సంస్థలు తమ సర్వర్లు స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇకముందు సినిమాలు బయటకు వెళితే కచ్చితంగా వారే దానికి బాధ్యత తీసుకోవాలి’ అన్నారు.
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ ‘ఈమధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా విజయం సాధించడం లేదు. దానికి ముఖ్యమైన కారణం పైరసీ. తెలంగాణ ప్రభుత్వం పైరసీని ఒక ఛాలెంజ్గా తీసుకొని పైరసీ చేసేవారిని పట్టుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు టికెట్ ధరలు నిర్ణయించాలి. కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు రావాలంటే పైరసీని అరికట్టడం ఒక్కటే మార్గం’ అన్నారు.