Updated : Mar 28, 2022
నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సెన్సేషనల్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. వాటిలో `లెజెండ్` (2014) ఒకటి. `సింహా` (2010) వంటి ఘనవిజయం తరువాత బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా కూడా అదే బాట పట్టింది. అలాగే, `సింహా`లాగే ఈ సినిమా కూడా `ఉత్తమ నటుడు`గా బాలకృష్ణకి `నంది`ని అందించింది. ఇందులో జయదేవ్ (లెజెండ్), కృష్ణగా రెండు విభిన్న పాత్రల్లో మెస్మరైజ్ చేశారు బాలయ్య. ప్రముఖ కథానాయకుడు జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా సుమన్, సుహాసిని, కళ్యాణి, సుజాత కుమార్, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ, ఆహుతి ప్రసాద్, రావు రమేశ్, చలపతిరావు, ఈశ్వరి రావు, సితార, ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. హంసా నందిని ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం `లెజెండ్`కి ప్రధాన బలంగా నిలిచాయి. టైటిల్ సాంగ్ తో పాటు ``నీ కంటి చూపుల్లో``, ``టైం బాంబ్``, ``తంజావూరు``, ``ఓం శర్వాణి``, ``లస్కు టప``.. ఇలా ఇందులోని గీతాలన్నీ రంజింపజేశాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలనచిత్రం పతాకాలపై రామ్ ఆచంద్, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన `లెజెండ్`.. 2014 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అలాగే `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ నటుడు`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ ప్రతినాయకుడు`, `ఉత్తమ ఎడిటర్` (కోటగిరి వెంకటేశ్వరరావు), `ఉత్తమ మాటల రచయిత` (ఎం. రత్నం), `ఉత్తమ గాయకుడు` (విజయ్ ఏసుదాస్), `ఉత్తమ ఫైట్ మాస్టర్స్` (రామ్ - లక్ష్మణ్).. ఇలా 8 విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2014 మార్చి 28న విడుదలై అఖండ విజయం సాధించిన `లెజెండ్`.. నేటితో 8 వసంతాలు పూర్తిచేసుకుంది.
