Updated : Mar 28, 2025
గత కొన్నిరోజులుగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై తెలంగాణ పోలీసులు సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలు, 25 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగానే విచారణకు హాజరు కావాల్సింది అందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొదట యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు నోటీసులు ఇవ్వగా, ఆమె క్వాష్ పిటిషన్ వేశారు. దాన్ని విచారించిన హైకోర్టు శ్యామలను అరెస్ట్ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణకు పోలీసులకు సహకరించాలని ఆమెకు సూచించింది కోర్టు.
ఇదిలా ఉంటే.. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో నిందితురాలిగా ఉన్న యాంకర్ విష్ణుప్రియకు కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు. దాంతో ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు ఆమె హాజరైంది. అలాగే ఈనెల 25న మరోసారి ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనపై నమోదైన రెండు కేసులను క్వాష్ చెయ్యాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఆమె పిటిషన్ను విచారించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విష్ణుప్రియను విచారించాల్సిందేనని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అలాగే విచారణ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది.
