English | Telugu

 

ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. జనవరి 10న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer), జనవరి 12న బాలకృష్ణ 'డాకు మహారాజ్' (Daaku Maharaaj), జనవరి 14న వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) విడుదలయ్యాయి. వీటిలో 'గేమ్ ఛేంజర్' డివైడ్ టాక్ ని సొంతం చేసుకోగా.. 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ మూడు సినిమాలు కలిసి బాక్సాఫీస్ దగ్గర ఒక అరుదైన రికార్డు సృష్టించాయి. అదేంటంటే ఈ మూడు సినిమాలు కూడా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటాయి. గతంలో సంక్రాంతి సీజన్ లో విడుదలైన రెండు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇలా విడుదలైన మూడు తెలుగు సినిమాలూ వంద కోట్ల క్లబ్ లో చేరడం ఇదే మొదటిసారి.

 

'గేమ్ ఛేంజర్' సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. త్వరలోనే రూ.200 కోట్ల మార్క్ ని కూడా అందుకోనుంది. అయినప్పటికీ అధిక థియేట్రికల్ బిజినెస్ కారణంగా ఈ సినిమా బయ్యర్లకు నష్టాలను మిగిల్చే అవకాశముంది. 'డాకు మహారాజ్' విషయానికొస్తే, పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి ఎంటర్ కానుంది. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ ని అందుకొని సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు బ్రేక్ సాధించి ప్రాఫిట్స్ లోకి కూడా ఎంటరైంది.

 

మొత్తానికి సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలూ మొదటి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త మ్యాజిక్ చేశాయి. అంతేకాదు ఫుల్ రన్ లో ఈ మూడు సినిమాలూ రూ.200 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదు.