English | Telugu

ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ తర్వాతి రోజుల్లో వాటి గురించి విచిత్రంగా చెప్పుకుంటారు. ఆరోజుల్లో అలా జరిగిందా అని ఆశ్చర్యపోతారు. అప్పట్లో టెక్నాలజీ అంతగా అందుబాటులో లేదు కాబట్టి సినిమాల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉండేది. వాటిని గుర్తించేంత పరిజ్ఞానం ప్రేక్షకులకు కూడా లేదు. కానీ, ఇప్పుడలా కాదు, సినిమాలో ఏ చిన్న పొరపాటు దొర్లినా దాన్ని సరిదిద్దుకునేంత సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉంది. ఎంతో మంది పర్యవేక్షణ, పరిశీలన దాటుకొని థియేటర్లలోకి సినిమా వస్తుంది. కానీ, వాటన్నింటి కళ్ళు కప్పి ఒక సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చూసిన తర్వాత షాక్‌ అవ్వడం యూనిట్‌ వంతు అయింది. 

విజయ్‌ ఆంటోని, విజయ్‌ మిల్టన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఆ సినిమా పేరు ‘మజై పడిక్కత మనితన్‌’. ఆగస్ట్‌ 2న తమిళ్‌లో రిలీజ్‌ అయింది. అందులో ఒక సీన్‌ చూసి దర్శకుడు, హీరో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తాము చేసిన ఫస్ట్‌ కాపీలోగానీ, సెన్సార్‌కి పంపిన కాపీలోగానీ ఈ సీన్‌ లేదు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఆ సీన్‌ వల్ల సినిమా కిల్‌ అయిపోయిందట. వాళ్ళు ఏదైతే సస్పెన్స్‌ పాయింట్‌గా అనుకున్నారో ఆ సీన్‌ వల్ల రివీల్‌ అయిపోయిందని బాధపడుతున్నారు. ఎట్టకేలకు దాన్ని తొలగించారు. దీనిపై విజయ్‌ ఆంటోని స్పందిస్తూ ‘సినిమాలోకి ఆ సీన్‌ ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతా చూసుకున్న తర్వాతే సెన్సార్‌కి పంపాము. సెన్సార్‌ నుంచి వచ్చిన తర్వాత కూడా చూశాము. ఆ సీన్‌ లేదు. కరెక్ట్‌గా రిలీజ్‌ టైమ్‌లోనే దాన్ని ఎవరు యాడ్‌ చేశారనేది అర్థం కాకుండా ఉంది’ అన్నారు. 

దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ రెస్పాండ్‌ అవుతూ ‘దీని గురించి నన్ను అపార్థం చేసుకోకుండా క్లారిటీ ఇచ్చిన విజయ్‌ ఆంటోనికి థాంక్స్‌ చెబుతున్నాను. దీనికి కారణమైన వారెవరో కనిపెడతాను’ అన్నారు. సాధారణంగా విజయ్‌ ఆంటోని సినిమాలు తమిళ్‌తోపాటు తెలుగులో కూడా రిలీజ్‌ అవుతుంటాయి. ఈ సినిమా విషయంలో మాత్రం ఒక వారం ముందుగా తమిళ్‌లో రిలీజ్‌ చెయ్యాలనుకున్నారు. అందుకే ఆగస్ట్‌ 2న తమిళ్‌లో రిలీజ్‌ చేశారు. ఆగస్ట్‌ 9న ‘తుఫాన్‌’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ఎక్స్‌ట్రాగా ఉన్న 2 నిమిషాల సీన్‌ని ముందుగానే గుర్తించారు కాబట్టి తెలుగు వెర్షన్‌కి ఆ సమస్య లేదు.