
రి-ఎంట్రీ ఇచ్చాక రీమేక్ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తిచూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ చిత్రం `కత్తి` ఆధారంగా రి-ఎంట్రీ మూవీ `ఖైదీ నంబర్ 150` చేసిన చిరు.. ఆపై `సైరా.. నరసింహారెడ్డి`, `ఆచార్య`కి మాత్రం స్ట్రయిట్ సబ్జెక్ట్స్ నే ఎంచుకున్నారు. అయితే, `ఆచార్య` తరువాత వరుసగా రీమేక్ లనే సెలెక్ట్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే చిరు ఖాతాలో `లూసిఫర్`, `వేదాళం` రీమేక్స్ ఉన్నాయి.
మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్` రీమేక్ ని మోహన రాజా డైరెక్ట్ చేయనుండగా.. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `వేదాళం` తాలూకు రీమేక్ మెహర్ రమేశ్ తెరకెక్కించనున్నారు. ఆపై బాబీ డైరెక్టోరియల్ స్ట్రయిట్ సబ్జెక్ట్ తోనే రూపొందనున్న మాస్ ఎంటర్టైనర్ కాగా.. ఆ నెక్స్ట్ మళ్ళీ రీమేక్ మూవీ చేయబోతున్నారని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాట మంచి విజయం సాధించిన `ఎన్నై అరిందాల్` చిత్రాన్ని `సాహో` ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రీమేక్ చేయడానికి చిరు సన్నాహాలు చేస్తున్నారట. తెలుగులో `ఎంతవాడుగానీ` పేరుతో అనువాదమైనప్పటికీ.. నేటివేటికి తగ్గ మార్పులతో ఈ రీమేక్ చేసేందుకు మెగాస్టార్ ఆసక్తిచూపిస్తున్నట్లు బజ్. త్వరలోనే `ఎన్నై అరిందాల్` రీమేక్ కి సంబంధించిన ప్రచారంలో వాస్తవమెంతో తెలుస్తుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే `వేదాళం`, `ఎన్నై అరిందాల్`.. ఈ రెండు సినిమాలు కూడా కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన చిత్రాలే కావడం విశేషం. మరి.. అజిత్ మూవీస్ రీమేక్స్ మెగాస్టార్ కి ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.






