Updated : Oct 5, 2021
చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో ముందుకు సాగడం.. అంత సులువైన విషయం కాదు. అయితే, కొంతమంది దర్శకులు సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ నిర్దేశకులెవరంటే..
ఎస్. ఎస్. రాజమౌళిః
దర్శకుడిగా రాజమౌళిది 20 ఏళ్ళ సినీ ప్రస్థానం. 2001లో విడుదలైన `స్టూడెంట్ నెం: 1` కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ దర్శకధీరుడు.. `బాహుబలి` సిరీస్ (2015, 2017)వరకు వరుసగా పదకొండు ఘనవిజయాలతో సంచలనం సృష్టించారు. ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్`తో 12వ విజయానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో జక్కన్నలా 11 వరుస విజయాలు చూసిన భారతీయ దర్శకుడు మరొకరు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రాజ్ కుమార్ హిరాణిః
సందేశం, వినోదాల మేళవింపు.. బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి చిత్రావళి. 2003లో విడుదలైన `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్`తో దర్శకుడైన హిరాణి.. మొదటి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించారు. ఆపై `లగే రహో మున్నా భాయ్`(2006), `3 ఇడియట్స్`(2009), `పీకే`(2014), `సంజూ`(2018) చిత్రాలతో ఆ పరంపరని కొనసాగించారు.
కొరటాల శివః
`మిర్చి`(2013) వంటి బ్లాక్ బస్టర్ తో దర్శకుడైన కొరటాల శివ.. ఆపై `శ్రీమంతుడు`(2015), `జనతా గ్యారేజ్` (2016), `భరత్ అనే నేను`(2018)తో మరో మూడు ఘనవిజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలో `ఆచార్య`తో పలకరించబోతున్నారు.
అనిల్ రావిపూడిః
`పటాస్` (2015) కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన అనిల్ రావిపూడి.. ఫస్ట్ ఎటెంప్ట్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆనక `సుప్రీమ్` (2016), `రాజా ది గ్రేట్` (2017), `ఎఫ్ 2` (2019), `సరిలేరు నీకెవ్వరు` (2020)తో అదే బాట పట్టారు. ప్రస్తుతం `ఎఫ్ 2` సీక్వెల్ `ఎఫ్ 3`తో డబుల్ హ్యాట్రిక్ పై గురిపెట్టారు.
