English | Telugu

అయ్యో.. చివరికి రామ్‌కి కూడా ఆ పరిస్థితి వచ్చేసిందా?

టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలుగా చలామణి అవుతున్న వారిలో కొందరు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ వున్న వారు, మరికొందరు ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చినవారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన సక్సెస్‌ అవుతారన్న గ్యారెంటీ లేదు. టాలెంట్‌ వుంటే వారి బ్యాక్‌గ్రౌండ్‌ కొంతవరకు సపోర్ట్‌గా ఉంటుంది. ఆ సపోర్ట్‌తోనే తర్వాతి కాలంలో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నవారు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలికాలంలో హీరోలు సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. వారిలో కొందరు సక్సెస్‌ అవుతున్నారు, మరికొందరు చేతులు కాల్చుకుంటున్నారు. హీరోలే నిర్మాతలుగా మారడానికి కారణాలు అనేకం ఉంటాయి. తమ అభిరుచికి తగ్గ సినిమా తియ్యాలన్న ప్యాషన్‌ కావచ్చు, బయటి నిర్మాతల నుంచి పిలుపు రాకపోవడం వల్ల  కావచ్చు. ఏది ఏమైనా ఒక హీరో నిర్మాతగా మారుతున్నాడు అంటే అవకాశాలు తగ్గడం వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడని అందరూ అనుకుంటారు. ఇప్పుడు రామ్‌ పోతినేనికి అదే పరిస్థితి వచ్చింది. తనే సొంతంగా సినిమాలు నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చారు. 

‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమై ఆ తర్వాత లవర్‌బోయ్‌ చాలా సినిమాల్లో కనిపించిన రామ్‌ పోతినేని.. ఇస్మార్ట్‌ శంకర్‌తో ఒక్కసారిగా మాస్‌ హీరోగా మారిపోయారు. అదే ఊపులో రెడ్‌, ది వారియర్‌, స్కంద వంటి సినిమాలు చేశారు. కానీ, ఆ సినిమాలు ఆశించిన విజయాలను అందించకపోవడంతో తనను మాస్‌ హీరోగా నిలబెట్టిన ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌గా వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో రామ్‌కి పెద్ద షాక్‌ తగిలింది. ప్రస్తుతం రామ్‌.. ఆంధ్రా కింగ్‌ తాలూకా సినిమా చేస్తున్నాడు. అతని చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే. షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమా తర్వాత రామ్‌ కమిట్‌ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఆ కారణంగానే సొంతంగా సినిమాలు నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. 

రామ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ 20 సంవత్సరాల్లో 22 సినిమాల్లో నటించాడు రామ్‌. అయితే వాటిలో తన పెదనాన్న స్రవంతి రవికిషోర్‌ నిర్మించిన సినిమాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రామ్‌కి కమిట్‌మెంట్స్‌ ఏమీ లేవు. మాస్‌ హీరోగా టర్న్‌ అయిన తర్వాత అతన్ని పరాజయాలే వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో స్రవంతి రవికిషోర్‌ రంగంలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ, అలాంటిదేమీ జరగడంలేదు. అందుకే తను నిర్మాతగా మారాలని రామ్‌ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్‌ ఈ సంవత్సరంలోనే ఉంటుందని సమాచారం. తన బేనర్‌లో వచ్చే తొలి సినిమా ద్వారా ఓ యువ దర్శకుడ్ని పరిచయం చెయ్యాలని రామ్‌ అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ చెయ్యబోతున్నారు. మరి తన బేనర్‌లో నిర్మించే తొలి సినిమాతో రామ్‌ ఎలాంటి ప్రయోగం చెయ్యబోతున్నాడు, నిర్మాతగా ఎంత వరకు సక్సెస్‌ అవుతాడు అనేది చూడాలి.