Read more!

English | Telugu

ఆత్మహత్యకు భయపడి రెండో పెళ్లి చేసుకొని నరకం అనుభవించిన ఘంటసాల!

సినిమా రంగంలో ఒక భార్యకు మించి ఉన్నవారు చాలా మందే కనిపిస్తారు. అలా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది చిత్ర పరిశ్రమలో. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు, తెలుగు సినిమా పుట్టిన నాటి నుంచి పలువురు సినీ ప్రముఖుల జీవితాల్లో జరిగిందే. రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నవారు కొందరు సఖ్యతగా, సంతోషంగా ఉంటే మరికొందరికి అది నరకప్రాయంగా ఉండేది. దీనికి ఉదాహరణగా మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావును తీసుకోవచ్చు. 

ఘంటసాల మొదటి భార్య పేరు సావిత్రి. ఆమెకు ఐదుగురు పిల్లలు. ఆయన రెండో భార్య పేరు సరళ. ఆమెకు ముగ్గురు సంతానం. అయితే ఘంటసాలకు రెండో భార్య, పిల్లలు ఉన్నారన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడేది సావిత్రి. ఒకవైపు ఘంటసాల తన రెండో భార్యను, పిల్లల్ని మొదటి భార్య దగ్గరకు తీసుకురావాలని, అందరూ కలిసి మెలిసి ఉంటే చూడాలని ఆశపడేవారు. కానీ, దానికి సావిత్రి ఒప్పుకునేది కాదు. ఈ విషయంలో ఘంటసాలకు ఎంతో మానసిక క్షోభను కలిగించేది సావిత్రి. ఘంటసాల రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక విధంగా మొదటి భార్య సావిత్రే కారణం. సరళ తమ పక్క వాటాలో నివసించే కుటుంబానికి చెందిన అమ్మాయి. ఒకరోజు సరళను ఘంటసాలకు పరిచయం చేసింది సావిత్రి. ఎప్పుడూ ఇంటికి వస్తూ పోతున్న తరుణంలో ఘంటసాల ఆమెకు దగ్గరయ్యారు. వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఘంటసాలను కోరింది సరళ. అంతకుముందు అలాంటి ఘటనే ఘంటసాల జీవితంలో జరిగింది. ఒక యువతి ఘంటసాలను ప్రేమించింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరింది. దానికి ఘంటసాల ఒప్పుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.  

ఇప్పుడు సరళ కూడా అదే కోరిక కోరుతోంది. కాదంటే ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమోనని భయపడి పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఘంటసాల జీవితంలోని విశేషాలను తెలియజేస్తూ ఆయన కుమార్తె డా.శ్యామల ఒక ఆన్‌లైన్‌ పత్రికలో సీరియల్‌గా రాస్తుండగా, దానిపై ఆమె తల్లి సావిత్రే కోర్టుకెక్కింది. సీరియల్‌ ఆపించేసింది. జీవిత కథలనేవి నిజాయితీగా వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని వాదించి ఆ కేసులో గెలుపొందారు శ్యామల. ఆ తర్వాత తను ఘంటసాల గురించి తెలియజేయాలనుకున్న అంశాలన్నింటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘నేనెరిగిన నాన్నగారు’ పేరుతో ఆ పుస్తకాన్ని ప్రచురించారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఘంటసాల జీవితంలో మనశ్శాంతి కరువైందని, ఇద్దరు భార్యలతో ఆయన నరకం అనుభవించారని డా.శ్యామల తన రచనలో పేర్కొన్నారు.