English | Telugu
డైలాగ్స్ విని కుర్చీని కాలితో తన్నిన భానుమతి... ఆ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది!
Updated : Jan 29, 2024
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాలరెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణల అనుబంధం ఎలాంటిదో చిత్ర పరిశ్రమలో అందరికీ తెలుసు. ‘ముక్కుపుడక’ చిత్రంతో మొదలైన వీరి స్నేహం చివరి వరకు కొనసాగింది. ఎస్.గోపాలరెడ్డి తన బేనర్లో చేసిన సినిమాలు 17. అందులో 13 సినిమాలు కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే రూపొందాయంటే వారిద్దరి మధ్య ఎంత మంచి బాండిరగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ముక్కు పుడక’ తర్వాత నందమూరి బాలకృష్ణతో ‘మంగమ్మగారి మనవడు’ వంటి సిల్వర్ జూబ్లీ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను బాలకృష్ణతో చెయ్యాలన్న ఆలోచన ఎవరిది, ఈ సినిమా ప్రారంభం కావడం వెనుక విశేషాలేమిటి అనే అంశాలను దివంగత కోడి రామకృష్ణ ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడిరచారు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘గోపాలరెడ్డితో నా ప్రయాణం ‘ముక్కుపుడక’తో ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్లో ఓ సినిమా చేద్దామని కథ రెడీ చేసుకున్నాం. హీరో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకున్నాము. చివరికి అప్పుడే హీరోగా ఎదుగుతున్న బాలకృష్ణతో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అయితే సినిమాల నిర్మాణంలో అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ల ప్రమేయం ఉంటూ ఉండేది. అందుకే ఈ కథను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్కి వినిపించడానికి నేను, గోపాలరెడ్డి వెళ్లాం. కథ విన్న ఆయన ఎవరితో చేద్దామనుకుంటున్నారు? అని అడిగాడు. బాలకృష్ణ పేరు చెప్పాం. మొదట ఆయన ఒప్పుకోకపోయినా తర్వాత ఓకే చెప్పారు. ఆ వెంటనే నాకు మరో ఆలోచన కూడా వచ్చింది. ఈ సినిమాలో బామ్మ క్యారెక్టర్ ఉంది కదా.. దానికి భానుమతిగారైతే బాగుంటుందని సలహా ఇచ్చాను. దానికి గోపాలరెడ్డి ఎంతో భయపడిపోయాడు. భానుమతిగారితో సినిమానా.. ఆవిడ్ని చూస్తేనే నాకు భయం అన్నాడు. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్కి కూడా చెప్పాం. దానికాయన వెంటనే.. భానుమతిగారితో సినిమానా.. ఈ ప్రాజెక్ట్ జరగదు అని తేల్చేశారు. ఒకసారి ఆమెను అడిగి చూద్దాం. తప్పేముంది అన్నాను. దానికి సరే అన్నాడు గోపాలరెడ్డి. ఇద్దరం కలిసి భానుమతి గారింటికి వెళ్లాం. కథ వినిపించి బాలకృష్ణతో చేద్దామనుకుంటున్నామని చెప్పాం. దానికామె.. ‘చాలా మంచి కుర్రాడు. తండ్రిలాగే డిసిప్లిన్ ఉంది’ అన్నారు. అందులో బామ్మ క్యారెక్టర్ మీరు చెయ్యాలి అని అడిగాము. ‘దానిదేముంది వాళ్ళ నాన్నకు కూడా నేను బామ్మగా నటించాను. తప్పకుండా చేస్తాను’ అన్నారు. గోపాలరెడ్డి మీ విషయంలో భయపడుతున్నాడు. మీరు టైమ్కి రారని, యారగెంట్గా ఉంటారని అందరూ చెబుతున్నారు అన్నాను. దానికి ‘గోపాల్ ఎందుకు భయపడుతున్నావు. నేను అలాంటి దాన్ని కాదు. డిసిప్లిన్ నుంచి వచ్చాను. నువ్వు ఎన్ని రోజుల్లో సినిమా పూర్తి చేస్తావు’ అని అడిగారు భానుమతి. 40 రోజుల్లో అవుతుంది’ అన్నాడు రెడ్డి. ‘నేను 35 రోజుల్లో పూర్తి చేస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నువ్వు ఏది చెబితే అది చేస్తాను. నువ్వు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను.. ఇది చాలా’ అన్నారామె. దానికి రెడ్డి ఆమె కాళ్ళకు నమస్కారం చేసి ‘ఇది చాలమ్మా’ అన్నాడు.
వారం రోజుల తర్వాత గణేష్ పాత్రో చేత ఆమె పోర్షన్ డైలాగ్స్ వినిపించాం. ఆ డైలాగులు విన్న వెంటనే కుర్చీని ఒక్కసారి కాలితో గట్టిగా తన్నారామె. సినిమా లేదు, ఏం లేదు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఈ డైలాగులు నేను చెప్పాలా? ఇలాంటి డైలాగులు భానుమతి చెబుతుందనుకున్నారా?’ అంటూ కోపంతో ఊగిపోయారామె. నేను, గోపాలరెడ్డి భయపడిపోయాం. డైలాగ్స్ మార్చి తీసుకొస్తాం అంటూ అక్కడి నుంచి వచ్చేశాం. ఈ ఘటన తర్వాత ‘ఆ డైలాగులు చెప్పకపోతే ఇక సినిమా ఏం ఉంటుంది’ అంటూ గోపాలరెడ్డి నీరసపడిపోయాడు. కంగారు పడొద్దు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాను. వారం తర్వాత పోరూర్లో షూటింగ్ మొదలు పెట్టాం. భానుమతిగారికి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, మద్రాస్ నుంచి జనం విపరీతంగా వచ్చారు. ఇంటి ముందు పనిమనిషితో సీన్. అయితే భానుమతిగారిలో ఉన్న మైనస్ ఏమిటంటే మొదటిరోజు షూటింగ్లో చాలా టెన్షన్ పడతారు. అదే మాకు ప్లస్ అయింది. ఆ టెన్షన్లోనే డైలాగ్ చెప్పేశారు. ‘ఓరి నీ భయం కూలిపోను. వెనకటికి నీలాంటి భయంగల బల్లి బట్టలిప్పేసి నీళ్లోసుకుంటూ బావగారొచ్చారని లేచి నిలబడిరదట’ అనే డైలాగ్ చెప్పారు. షాట్ ఓకే అయింది. అక్కడికి వచ్చిన జనం ఆ డైలాగ్ విని చప్పట్లు కొట్టారు, విజిల్స్ వేశారు. భానుమతిగారికి విషయం అర్థం కాక ‘ఎందుకు ఈ డైలాగ్కి అందరూ చప్పట్లు కొడుతున్నారు’ అని అడిగారు. మీరు ఇంతకుముందు డైలాగ్స్ చెప్పనని అన్నారు కదా అందులో డైలాగే ఇది అని చెప్పాను. దానికామె ఆశ్చర్యపోయారు. ఒక్క డైలాగ్కే ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే సినిమా మొత్తం గణేష్ పాత్రో రాసిన డైలాగ్స్ చెబితే ఎంత రెస్పాన్స్ వస్తుంది? అని ఆమెను రిక్వెస్ట్ చేస్తూ అన్నాను. దానికామె పాజిటివ్గా స్పందిస్తూ ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంతకుముందు సినిమాకి అనుకున్న డైలాగుల్నే చెప్పి సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే’ అంటూ వివరించారు కోడి రామకృష్ణ.