Read more!

English | Telugu

చిరంజీవి, బాలకృష్ణ నా బిడ్డల్లాంటివారు.. అభిమానులకు హితబోధ చేసిన శోభన్‌బాబు!

సినిమా తారలంటే అందరికీ అభిమానమే. అది కొంతమందిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా హీరోల అభిమానులు తమ హీరోని ఆరాధ్యదైవంగా భావిస్తారు. తమ అభిమాన హీరో కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతారు. ఒక్కోసారి హీరోల అభిమానుల మధ్య వివాదాలు తలెత్తుతాయి, వాగ్వాదాలు జరుగుతాయి. కొట్లాటలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోషల్‌ మీడియా అనేది తెలియని రోజుల్లో, అసలు మీడియా అంటేనే తెలియని రోజుల్లో పరిస్థితులు వేరుగా ఉండేవి. అప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనం కాబట్టి సినిమాలు ఎక్కువగా చూసేవారు. అలా ఆయా హీరోలకు అభిమానులు కూడా ఎక్కువగానే ఉండేవారు. ప్రతి హీరోకి ఫ్యాన్స్‌ అసోసియేషన్స్‌ ఉండేవి. ఒకేరోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ అయ్యాయంటే ఇక ఆయా హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు, ముష్టియుద్ధాలు జరుగుతూ ఉండేవి. పరిస్థితి శృతి మించినపుడు తమ అభిమానులకు శాంతియుతంగా ఉండాలని, జయాపజయాలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని హీరోలు తమ అభిమానులకు హిత బోధ చేసేవారు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఆ మాటల తూటాలను సోషల్‌ మీడియాలో సంధించుకుంటున్నారు హీరోల అభిమానులు. 

అభిమానులు సామరస్యంగా ఉండాలని శోభన్‌బాబు ఒక సందర్భంలో కోరారు. శోభన్‌బాబుకు సన్మానం చేసేందుకు ఆహ్వానించారు అభిమానులు. ఆ సన్మాన కార్యక్రమంలో పలు అంశాలను అభిమానులతో పంచుకున్నారు. వారిని ఉద్దేశించి శోభన్‌బాబు మాట్లాడుతూ ‘మీరందరూ నా బిడ్డలతో సమానం అని చెప్తుంటాను. నేనెప్పుడూ ఆ మాటకు కట్టుబడి ఉంటాను. అలాగే చిరంజీవి, బాలకృష్ణ కూడా నా బిడ్డలతో సమానమే. ఎందుకంటే నాకు వారి వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. చిరంజీవి, బాలకృష్ణ కూడా ఇంచుమించు ఒకే వయసు అయి ఉంటుంది. అందువల్ల ఎవరినీ విమర్శించవద్దు. మీకు సినిమా నచ్చితే సపోర్ట్‌ చెయ్యండి లేదంటే సైలెంట్‌గా ఉండండి. అంతేతప్ప ఆ హీరోలను, వారి అభిమానులను విమర్శించవద్దు. చిరంజీవి, బాలకృష్ణలతో నేను పోటీ పెట్టుకోను, మీరు కూడా పెట్టుకోవద్దు. బిడ్డలతో తండ్రి పోటీ పెట్టుకుంటాడా.. పెట్టుకోడు. అలాగే మన సినిమాలతో వారి సినిమాలను కంపేర్‌ చెయ్యొద్దు. అందరు హీరోల అభిమానులతో స్నేహపూర్వకంగా ఉండమని సభాముఖంగా మీ అందర్నీ కోరుతున్నాను’ అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు శోభన్‌బాబు.