political-news-img

పేపర్ లీకేజీలు.. విద్యా మంత్రుల రాజీనామాలు.!

నాన్-బీజేపీ పాలనలో ఎంత మంది విద్యా మంత్రులు రాజీనామా చేశారు? అనే ప్రశ్నతో వైరల్ అవుతున్న ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఒక రాజకీయ ఆరోపణ కంటే ఎక్కువ, ఒక చారిత్రక ప్రశ్నను లేవనెత్తుతోంది. 2006 నుండి 2024 వరకు దేశవ్యాప్తంగా జరిగిన 19 ప్రధాన పరీక్షా లీకేజీలు, నియామక కుంభకోణాల జాబితాను ఇది ప్రస్తావిస్తూ.. ఆయా సమయాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్ (యూపీఏ), బహుజన సమాజ్ పార్టీ, అన్నాడీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జేఎంఎం-కాంగ్రెస్, మహాఘట్ బంధన్ వంటి బీజేపీయేతర కూటములేనని పేర్కొంటూ.. ఆయా సందర్భాలలో ఏ ఒక్క కేసులోనూ విద్యా శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదని పేర్కొంటోంది. ఈ వాదనలోని వాస్తవికతను యథాతథంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ జాబితాలోని చాలా కేసుల పేర్లు, సంవత్సరాలు ప్రజా జ్ఞాపకంలో ఉన్న వివాదాలతో ముడిపడి ఉన్నవే. కేంద్రంలో యూపీఏ హయాంలో 2011లో జరిగిన ఏఐఈఈఈ లీకేజీలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. ప్రశ్నాపత్రం 6 లక్షలకు అమ్ముడైందనే ఆరోపణతో సీబీఎస్ఈ (సీబీఎస్ఈ) పరీక్షను రెండు గంటలు వాయిదా వేయాల్సి వచ్చింది. అయినా అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా చేయలేదు. 1999-2000 నాటి 3,206 జేబీటీ టీచర్ల అక్రమ నియామకాల కుంభకోణం, దీనిపై 2013లో మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు శిక్ష పడింది. అలాగే 2011 యూపీపీసీఎస్ విషయం పేపర్ లీక్ కాదు, రిజర్వేషన్ విధానంపై వివాదం. అయినప్పటికీ మంత్రి రాజీనామా జరిగిందా? అనే దానికి సమాధానం మాత్రం అన్ని కేసుల్లోనూ 'లేదు' అనే వస్తుంది. భారతదేశంలో పరీక్షా వ్యవస్థపై నమ్మకం స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన మెరిటోక్రసీ భావనకు పునాది. అయితే 90వ దశకం తర్వాత ప్రైవేటీకరణ, కోచింగ్ మాఫియా, మొబైల్ ఫోన్ల విస్తరణతో పేపర్ లీక్ ఒక వ్యవస్థీకృత నేరంగా మారింది. 2006లో ఏఐఐఎంఎస్ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షలో చెన్నై కేంద్రం నుండి 424 మంది ఎంపిక కావడం, సమాధానాలు ఎస్ఎంఎస్ ద్వారా పంపబడ్డాయని సీబీఐ గుర్తించడం ఈ నేరానికి తొలి హైటెక్ రూపం. ఆ తర్వాత 2011-2014 మధ్య కాలం యూపీఏ రెండో దశలో ఏఐఈఈఈ, సీబీఎస్ఈ క్లాస్ 12 ఫిజిక్స్ వంటి జాతీయ పరీక్షలు, రైల్వే గ్రూప్-డి వంటి నియామక పరీక్షలు వరుసగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర స్థాయిలో తమిళనాడులో టీఎన్పీఎస్సీ, అన్నా యూనివర్సిటీ, కర్ణాటకలో పీయూసీ, జమ్మూ కాశ్మీర్ మెడికల్ అడ్మిషన్ వంటి కేసులు నమోదయ్యాయి. ఇన్ఫోగ్రాఫిక్ లో పేర్కొన్న 19 కేసులను మూడు దశలుగా విభజించి చూడవచ్చు. మొదటి దశ 2006-2014, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాం. ఈ కాలంలో ఏఐఐఎంఎస్, ఏఐఈఈఈ, రైల్వే, సీబీఎస్ఈ వంటి కేంద్ర సంస్థల పరీక్షలే లీక్ అయ్యాయి. రెండవ దశ 2012-2015, రాష్ట్రాల్లో ఏఐఏడీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి, సమాజ్ వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీల హయాంలో జరిగిన విశ్వవిద్యాలయ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీలు. మూడవ దశ 2021-2024, రాజస్థాన్ లో ఆర్ఈఈటీ 2021, బీహార్, జార్ఖండ్, జేఎస్ఎస్సీ సీజీఎల్ వంటి ఇటీవలి కేసులు. పరిశీలనలో తేలిన అంశం ఏమిటంటే, ఈ జాబితాలోని ఏ ఒక్క కేసులోనూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. 2016లో కర్ణాటక పీయూసీ కెమిస్ట్రీ పేపర్ రెండు సార్లు లీక్ అయి 1.74 లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కి మంత్రి రాజీనామా డిమాండ్ చేసినా, అప్పటి విద్యా మంత్రి కిమ్మనే రత్నాకర్ కొనసాగారు, తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తొలగించబడ్డారనుకోండి అది వేరే సంగతి. 2021 రాజస్థాన్ ఆర్ఈఈటీ కేసులో గెహ్లాట్ ప్రభుత్వం ఆర్బీఎస్ఈ చైర్మన్ డీపీ జరోలిని తొలగించి, పరీక్షను రద్దు చేసింది కానీ విద్యా మంత్రి బీడీ కల్లా రాజీనామా చేయలేదు. 2024 జార్ఖండ్ సీజీఎల్ కేసులో కూడా ప్రభుత్వం ఎస్ఐటీ వేసి పరీక్షను రద్దు చేసింది, కానీ మంత్రి స్థాయిలో బాధ్యత తీసుకోలేదు. ఈ జాబితా ఒక అసౌకర్యమైన పరిపాలనా సంస్కృతిని బయటపెడుతోంది. పేపర్ లీక్ జరిగినప్పుడు బలిపశువులుగా మారేది బోర్డు చైర్మన్లు, సెక్రటరీలు, ట్రెజరీ అధికారులు, చిన్నపాటి ఏజెంట్లు మాత్రమే. రాజకీయ నాయకత్వం మాత్రం విచారణకు ఆదేశించామని, పరీక్ష రద్దు చేశామని చెప్పి తప్పించుకునే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోంది. న్యాయపరంగా ఈ కేసులన్నింటిలోనూ చర్యలు తీసుకోబడ్డాయి. దాదాపు అన్ని కేసుల్లో ఐపీసీలోని మోసం, ఫోర్జరీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2006 ఏఐఐఎంఎస్ కేసులో సీబీఐ 35 చోట్ల దాడులు చేసి 28 మంది వైద్యులపై కేసు పెట్టింది. 2011 ఏఐఈఈఈ కేసులో యూపీ ఎస్టీఎఫ్ పేపర్ ను స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కర్ణాటక పీయూసీ కేసులో సీఐడీ విచారణ జరిపి కింగ్ పిన్ శివకుమారయ్య అలియాస్ గురూజీని కర్ణాటక వ్యవస్థీకృత నేరాల చట్టం కింద అరెస్ట్ చేసింది. రాజస్థాన్ ఆర్ఈఈటీలో ఎస్ఓజీ 40 మందికి పైగా అరెస్ట్ చేసింది. అయితే న్యాయస్థానాలు ఎక్కడా మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయలేదు. హర్యానా కేసులో కోర్టు మాజీ ముఖ్యమంత్రిని శిక్షించినా, అది నియామకాల్లో అక్రమాలకు తప్ప పేపర్ లీక్ కు కాదు. చాలా కేసుల్లో కోర్టులు పరీక్షలను రద్దు చేయడం, తిరిగి నిర్వహించమని ఆదేశించడం, సీబీఐ విచారణకు నిరాకరించి రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై నమ్మకం ఉంచడం వంటివి చేశాయి. ఇది ఒక వ్యవస్థాగత లోపాన్ని సూచిస్తుంది - నేరం వ్యక్తిగత అవినీతిగా పరిగణించబడుతుంది తప్ప, విధానపరమైన వైఫల్యంగా, మంత్రి బాధ్యతగా పరిగణించబడదు. రాజకీయ, సామాజిక, మీడియా కోణాలు రాజకీయంగా ఈ ఇన్ఫోగ్రాఫిక్ ప్రస్తుత చర్చకు ఒక అద్దం పడుతోంది. నీట్, నెట్ పరీక్షల లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రి రాజీనామా డిమాండ్ వచ్చినప్పుడు, అధికార పక్షం గతంలో ఏ ప్రభుత్వంలోనూ మంత్రులు రాజీనామా చేయలేదని వాదించడానికి ఈ చరిత్రను ఉపయోగిస్తోంది. ప్రతిపక్షం మాత్రం ప్రతి లీక్ ను ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తోంది. ఈ ద్వంద్వ ప్రమాణాల ఆటలో విద్యార్థుల ప్రయోజనం వెనుకబడిపోతోంది. సామాజిక కోణంలో, ఈ లీకేజీల వల్ల అత్యధికంగా నష్టపోయేది గ్రామీణ, పేద విద్యార్థులు. 2021 ఆర్ఈఈటీలో 16.5 లక్షల మంది, 2024 జేఎస్ఎస్సీలో 6.5 లక్షల మంది అభ్యర్థులు ప్రభావితమయ్యారు. మీడియా విషయానికి వస్తే.. 2006-2014 మధ్య కాలంలో జాతీయ మీడియా ఈ లీకేజీలను వ్యవస్థాగత అవినీతిగా కాకుండా, అప్పుడప్పుడు జరిగే నేరంగా చూసింది. 2021 తర్వాత సోషల్ మీడియా, థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో విద్యార్థులు నేరుగా ఆందోళనలు నిర్వహించడం, పేపర్ లీక్ వీడియోలను వైరల్ చేయడం వల్ల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. ఈ వరుస వైఫల్యాల ప్రభావం విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ప్రతి లీక్ తర్వాత ప్రభుత్వం ట్రెజరీల్లో సీసీటీవీలు, జీపీఎస్ వాహనాలు, మోషన్ సెన్సార్లు వంటి సాంకేతిక పరిష్కారాలను ప్రకటిస్తుంది, కానీ మూల కారణమైన రాజకీయ జోక్యం, కోచింగ్ మాఫియా, ఉద్యోగాల కొరత వంటి అంశాలను పట్టించుకోదు. ఇన్ఫోగ్రాఫిక్ చివరన ఉన్న నినాదం.. ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, అండ్ దెన్ యు కెన్ ఆజిటేట్ & ఆర్గనైజ్ అన్నది.. విద్యార్థి ఉద్యమాలను ఎద్దేవా చేస్తున్నట్లు అనిపించినా, అదే సమయంలో ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది. నైతిక బాధ్యత అంటే ఏమిటి? బ్రిటిష్ సంప్రదాయంలో రైలు ప్రమాదానికి రైల్వే మంత్రి రాజీనామా చేసిన ఉదాహరణలు ఉన్న దేశంలో, పరీక్షా లీక్ కు విద్యా మంత్రి రాజీనామా చేయాలా వద్దా అనేది చట్టపరమైన ప్రశ్న కంటే, రాజకీయ నైతికతకు సంబంధించిన ప్రశ్న. ఇన్ఫోగ్రాఫిక్ లోని ప్రధాన వాదన.. బీజేపీయేతర ప్రభుత్వాల హయాంలో జరిగిన ఏ పేపర్ లీక్ కేసులోనూ విద్యా మంత్రి రాజీనామా చేయలేదు. ఇది ఏ ఒక్క పార్టీని సమర్థించే అంశం కాదు, భారత రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం అనేది ఎలా నీరుగారిపోయిందో చెప్పే ఒక నగ్న సత్యం. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. Resignations of Education Ministers, competitive exam paper leaks, the culture of paper leaks in India, students' futures and politics, systemic failures, accountability

Publish Date: Jul 24, 2026 10:50AM

political-news-img

నిరాహార దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్.!

నీట్ పేపర్ లీక్ కు నిరసనగా గత 26 రోజులుగా చేస్తున్ననిరాహార దీక్షను సోనమ్ వాంగ్ చుక్ విరమించారు. పరీక్షల వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళన, జవాబుదారీతనం కోరుతూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరశన దీక్షను సోనమ్ వాంగ్ చుక్ విరమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు లిఖిత పూర్వక హామీలే కారణం. విద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది. గురుగ్రామ్‌ మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా కలిసి కేంద్ర ప్రభుత్వం తరఫున హామీల పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు రెండు మూడు రోజుల నుంచీ.. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వాంగ్‌చుక్ బృందం విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది. మౌఖిక ప్రకటనలు లేదా మాటలకు పరిమితం కాకుండా, స్పష్టమైన లిఖితపూర్వక భరోసా ఇస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ ఆ బృందానికి విస్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లిఖిత పూర్వకంగా రావడంతో దీక్ష విరమించినట్లు ఆయన తెలిపారు. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటంటే.. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఘటనతో పాటు దేశంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థలో చోటుచేసుకున్న లోపాలు, అక్రమాలకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యల అంశాన్ని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమగ్రంగా చర్చిచడం, పేపర్ లీక్ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం, ఉన్న కేసులను ఎత్తివేయడం. ఈ మూడు హామీలతో సోనమ్ వాంగ్చుక్ నిరశన దిక్ష విరమించారు. కేంద్ర హామీలకు తోడు.. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, విద్యార్థులు, పౌరసమాజ ప్రతినిధులు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరశన దీక్ష విరమించాలని చేసిన విజ్ణప్తులు కూడా తన దీక్ష విరమణకు కారణమని ఆయన తెలిపారు. తన పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. దీక్ష విరమణ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా స్పందించారు. వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వైద్యుల సూచనలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. అంతేకాకుండా, నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, భవిష్యత్తులో దేశంలో ఎలాంటి పోటీ పరీక్షల్లోనూ ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని మరోసారి దేశానికి భరోసా ఇచ్చారు. NEET UG 2026 paper leak, Central government assurances, JP Nadda Jitendra Singh Medanta

Publish Date: Jul 24, 2026 10:00AM

political-news-img

మోడీ హామీని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన కాక్రోచ్ జనతా పార్టీ.!

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. దీంతో ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించిన ప్రధాని మోడీ.. పరీక్షల నిర్వహణ వ్యవస్థపై సర్వత్రా చెదిరిపోయిన నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు, లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అయితే ప్రధాని హామీని, ప్రతిపాదనను కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్న యువత నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది. విద్యార్థుల సమస్యలపై చర్చలు, ప్రభుత్వ అధికారిక భవనాలు లేదా ప్రదేశాల్లో కాకుండా, జంతర్ మంతర్ వేదికగా జరగాలని సీజేపీ స్పష్టం చేసింది. అలాగే శుక్రవారం (జులై 24) దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. సీజేపీ పిలుపు నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా బలగాలు తీవ్ర అప్రమత్తమయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పాస్‌పోర్టులను రద్దు చేస్తామనీ ప్రభుత్వం హెచ్చరించింది. అదలా ఉంటే ఆందోళన చేస్తున్న విద్యార్థులు చేస్తున్న ఆరోపణల నిజాయితీనే ప్రశ్నిస్తూ బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ.. నీట్ లీకేజీపై ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియో ప్రకటన దయనీయంగా ఉందనీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రవెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలు విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, అలియా భట్, గ్లో పాప్ ఐకాన్ దిల్జీత్ దొసాంజ్, దక్షిణాది దిగ్గజ నటులు కమల్ హాసన్, ఆర్. మాధవన్, విజయ్ సేతుపతి వంటి వారు విద్యార్థులకు బాసటగా గళమెత్తారు. NEET paper leak controversy, CJP protest NEET, PM Modi fast track courts

Publish Date: Jul 24, 2026 9:21AM

political-news-img

వంద డాలర్లకు చేరువైన బ్యారల్ ముడి చమురు ధర.. చమురు మంటలు ఆగేదెన్నడు?

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ముడి చమురు ధరలకు మంట పెట్టాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతుండటం, చమురు ట్యాంకర్లపై దాడులు కారణంగా ముడి చమురు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికా ఇరాన్‌పై వరుసగా 13 రోజు కూడా వైమానిక దాడులకు పాల్పడింది. హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది. ప్రపంచ సముద్ర రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా, ఇరాన్ ముఖాముఖి సైనిక ఘర్షణలకు తోడు మరో కీలకమైన సముద్ర మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ సమీపంలో హౌతీలువిరుచుకుపడుతుండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆర్థిక సంక్షోభం తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను వెంటనే ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హౌతీలను ఇరాన్ ప్రాక్సీ గ్రూప్‌గా అభివర్ణించిన ఆయన.. హౌతీల విధ్వంసక చర్యలకు ఇరాన్‌నే బాధ్యులను చేస్తామని కుండబద్దలు కొట్టారు. దాడుల్లో దెబ్బతిన్న నౌకలకు, నష్టపోయిన సరుకులకు పరిహారంగా అమెరికా వద్ద నిలిచిపోయిన ఇరాన్ సీజ్డ్ నిధులను ఉపయోగిస్తామని ప్రకటించారు. అదలా ఉంటే.. ఈ వివాదాన్ని తక్షణమే శాంతియుతంగా, దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అత్యవసర శాంతి చర్చల ప్రయత్నాల కోసం ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ టెహ్రాన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. Strait of Hormuz tensions, Crude oil price near 100, US Iran conflict, Bab el Mandeb attack

Publish Date: Jul 24, 2026 9:05AM

political-news-img

బేబీ బాస్ వరల్డ్ రికార్డు.!

క్రికెట్ లో బేబీ బాస్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పసి ప్రాయంలోనే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేసి సంచలనాలు సృష్టిస్తున్నాడు. పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్, అతి పిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికట్ లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌తో ఆడిన తొలి మూడు మ్యాచ్ లలోనూ సిక్సర్లు బాదినా భారీ స్కోరు చేయడంలో విఫలమై నిరాశ పరిచిన ఈ కుర్రోడు.. జింబాబ్వేపై చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తిరగరాసిన వరల్డ్ రికార్డులు ఏమిటంటే.. టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్.. ఇంతకు ముందు ఈ రికార్డు లూయిస్ బ్రూస్ (16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. అయితే పూర్తిస్థాయి సభ్య దేశాల ఆటగాళ్లలో ఈ రికార్డు ఆఫ్ఘ‌నిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ (17 ఏళ్ల 296 రోజులు) పేరిట ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20) కలిపి పూర్తిస్థాయి సభ్య దేశాల తరఫున అతి పిన్న వయసులో తొలి అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు. అసోసియేట్ దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 50+ స్కోరు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా సూర్యవంశీ నిలిచాడు. గతంలో నేపాల్ ఆటగాడు కుశల్ మల్లా 15 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును కూడా అధిగమించి భారత క్రికెట్‌లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు. Vaibhav Suryavamshi world record, Zimbabwe, t20match, Halfcentury

Publish Date: Jul 24, 2026 8:45AM

MOVIE NEWS