political-news-img

విషాదం...ఒకే ఇంట్లో నలుగురు సూసైడ్

నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సాగర్ రోడ్డులోని ఓ డాబా వెనుక నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి స్థానికులు వెళ్లి పరిశీలించగా.. కుళ్లిన స్థితిలో నాలుగు మృత దేహాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరు కుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అను మానిస్తున్నారు. అయితే ఈ కుటుంబం ఇంతటి దారుణ నిర్ణయం ఎందుకు తీసు కుంది? ఆర్థిక ఇబ్బందులా? కుటుంబ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందిన ఈ ఘటన నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Publish Date: Jun 22, 2026 9:05PM

political-news-img

ఫోన్‌లో మాట్లాడుతూ అంతస్తు నుంచి జారిపడి యువతి మృతి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ యువతి ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూరి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ప్రణవి (20) భవనం ఐదో అంతస్తులోని పిట్టగోడపై కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతోంది. ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భారీ ఎత్తు నుంచి కిందపడటంతో ప్రణవికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా, అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Publish Date: Jun 22, 2026 8:56PM

political-news-img

రైల్వే మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం !

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా దిల్లీ వేదికగా కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సంయుక్తంగా భేటీ అయ్యారు. దేశ రాజధానిలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 బదలాయింపుతో పాటు, ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి మెట్రో ప్రాజెక్టుకు అందాల్సిన సుమారు రూ. 13,600 కోట్ల రుణాల విడుదలలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భాగ్యనగరానికి ఈ నిధులు ఎంతో అవసరమని, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కీలక భేటీలో మెట్రో విస్తరణకు సంబంధించిన సమగ్ర నివేదికలను, ఒప్పంద పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రికి స్వయంగా అందజేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే 76.4 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఐదు ప్రధాన కారిడార్ల ప్రాధాన్యతను వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం తన వాటాను సకాలంలో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొని, తెలంగాణలోని రైల్వే, మెట్రో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. సాంకేతిక, ఆర్థిక పరమైన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే, కేంద్ర నిధుల విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా మెట్రో ఫేజ్-2 నిధుల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర మంత్రుల మధ్య రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడం, ఆపై ఇద్దరూ కలిసి దిల్లీలో రైల్వే అధికార యంత్రాంగంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఇరు నేతలు ఒకే వేదికపైకి రావడం పట్ల ప్రజా సంఘాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రతిపాదనలను పరిశీలించి, నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీతో భాగ్యనగర మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులకు త్వరలోనే లైన్ క్లియర్ కానుందని, రాబోయే రోజుల్లో నగర ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుంచి భారీ ఉపశమనం లభించనుందని ఐటీ, పారిశ్రామిక రంగాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Publish Date: Jun 22, 2026 8:47PM

political-news-img

సర్కారు బడికి వస్తే నెలకు రూ.1000... జీతం నుంచి ఇస్తున్న టీచర్

విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడి తపన.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేట్ పాఠశాలల పోటీని తట్టుకుంటూ, మూతపడే స్థితికి చేరిన ప్రభుత్వ బడిని కాపాడుకునేందుకు ఆయన తన సొంత జేబు నుండి విద్యార్థులకు నగదు పురస్కారం ప్రకటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం లింగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత కొన్ని ఏళ్లుగా విద్యార్థులు లేక పూర్తిగా మూతపడింది. అయితే, విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది. కానీ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం అధికారులకు, ఉపాధ్యాయులకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలలో విధులు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయుడు బిజ్జుర్వార్ సాయినాథ్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. తన బడిలో చేరే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా రూ. 1000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తానని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి కాకుండా, తన సొంత జీతం డబ్బుల నుంచి ఇస్తానని ఆయన గ్రామస్తులకు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడు సాయినాథ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఊరి జనాన్ని ఆకర్షించింది. ఆయన ఈ ఆఫర్ ప్రకటించిన అతి తక్కువ కాలంలోనే, మూతపడిన ఆ స్కూల్లో ముగ్గురు పిల్లలు కొత్తగా అడ్మిషన్లు పొందారు. శూన్యంతో ప్రారంభమైన బడిలో ఇప్పుడు ముగ్గురు విద్యార్థులు చేరడం ఆ ఉపాధ్యాయుడి ప్రయత్నానికి దక్కిన తొలి విజయంగా భావించవచ్చు. ఈ వినూత్న ప్రయత్నంపై స్థానిక ప్రజల నుంచి భిన్నమైన, ఆసక్తికరమైన స్పందన వస్తోంది. విద్యార్థి దశలోనే పిల్లలకు 'నెలవారీ జీతం' అందుతోందంటూ గ్రామస్తులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఉపాధ్యాయుడి నిబద్ధతను చూసి పలువురు విద్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి గ్రామ సర్పంచులు, వైద్యులు, సమాజ సేవకులు ఉచిత రవాణా, నగదు బహుమతులు వంటి ఆఫర్లు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. అదే కోవలో ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడే స్వయంగా రంగంలోకి దిగి తన వేతనాన్ని త్యాగం చేయడం విశేషం. సొంత నిధులతో బడిని బతికించుకోవాలని చూస్తున్న సాయినాథ్ చొరవతో రానున్న రోజుల్లో లింగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఆదర్శ ఉపాధ్యాయుల ప్రయత్నాలకు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు కూడా తగిన సహాయ సహకారాలు అందించి, గ్రామీణ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Publish Date: Jun 22, 2026 7:37PM

political-news-img

కన్నతల్లే కసాయి... రెండేళ్ల చిన్నారి హత్య వెనుక షాకింగ్ కుట్ర

రెండేళ్ల చిన్నారి హత్య కేసు ఛేదన.. తల్లి, ప్రియుడి కుట్ర బట్టబయలు... మేడ్చల్–మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కనిపించిన ఈ ఘటన వెనుక తల్లి, ఆమె ప్రియుడి కుట్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నతల్లే తన ప్రియుడితో కలిసి పసిబిడ్డను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. కీసర మండలం చెర్యాల గ్రామంలోని ఈడెన్ గార్డెన్స్‌కు చెందిన రంగా స్వామి, జూన్ 13న తన రెండేళ్ల కుమారుడు రంగా హరికృష్ణ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మే 29న బాలుడు ఇంట్లో పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తల్లి రంగా జ్యోతి కుటుంబ సభ్యులను నమ్మించింది. ఘటనపై అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో కీసర పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించారు. ఈ క్రమంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో జ్యోతి, మొగిళ్ల నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే నవీన్ ఇంటికి వచ్చినట్లు, అనంతరం బాలుడిని ఆస్పత్రికి తరలించడంలో కూడా అతడు పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో అనుమానం మరింత బలపడగా, జూన్ 19న బాలుడి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పోలీసుల విచారణలో జ్యోతి, నవీన్ ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించి ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు వెల్లడైంది. నవీన్ బాలుడిని నేలపై బలంగా కొట్టి చంపగా, తల్లి జ్యోతి అతనికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించే ప్రయత్నంలో బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.ఈ కేసులో ప్రధాన నిందితులైన మొగిళ్ల నవీన్, రంగా జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు వివరాలను జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి మీడియాకు వెల్లడించారు.

Publish Date: Jun 22, 2026 6:52PM

political-news-img

లక్నో అగ్ని ప్రమాదంలో... 14 మంది విద్యార్థులు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అలీగంజ్‌లోని ఉషా మెహతా మార్గ్‌లో గల ఒక అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో కోచింగ్ సెంటర్, యానిమేషన్ ఇన్స్టిట్యూట్ మరియు ఒక గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది 14 ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో రెస్క్యూ టీమ్‌ గోడలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాల్సి వచ్చింది. లోపల చిక్కుకున్న విద్యార్థులను కాపాడేందుకు హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనాన్ని కూడా రంగంలోకి దించారు. ప్రమాద తీవ్రతకు భయపడిన కొందరు విద్యార్థులు ప్రాణాలు దక్కించుకోవడానికి భవనం మొదటి అంతస్తు నుండి కిందికి దూకారు. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు విద్యార్థులు ప్రాణరక్షణ కోసం వాష్‌రూమ్‌లలో దాక్కున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఒక్కో గదిని తనిఖీ చేస్తూ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. ఈ ఘోర ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటిస్తూ పీఎంఓ సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లలో కఠినమైన అగ్నిమాపక నిబంధనలను అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవనంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Publish Date: Jun 22, 2026 6:08PM

MOVIE NEWS