political-news-img

ఇరాన్ కు రష్యా వెన్నుదన్ను!

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తదాడులను ఇరాన్ దీటుగా ఎదుర్కొనడం వెనుక రష్యా వెన్నుదన్నులు ఉన్నాయన్న విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. రష్యా, ఇరాన్ సంబంధాలు, రష్యా ఇరాన్ కు అందిస్తున్న రక్షణ సహాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యుద్ధ సమయంలో ఇరాన్‌కు రష్యా సహకారం ఏ మేరకు అన్న విషయంపై ఆసక్తికర అంశాలు ఈ చర్చల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్ల కదలికలకు సంబంధించిన అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మాస్కో ఇరాన్ కు చేరవేస్తున్నదన్న చర్చ జోరుగా సాగుతోంది. రష్యా నిఘా సహాయం కారణంగానే ఇరాన్ అమెరికాను దీటుగా ఎదుర్కొనడమే కాకుండా, తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఎదురుదాడులకు పాల్పడగలుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రష్యా అత్యాధునిక 'లియానా' గూఢచారి ఉపగ్రహాల ద్వారా అమెరికా విమానవాహక నౌకలపై నిరంతరం నిఘా ఉంచుతూ, ఈ డేటాను ఇరాన్‌కు అందిస్తోందనీ, ఆ కారణంగానే.. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం టెహ్రాన్‌కు తేలిక అవుతోందనీ చెబుతున్నారు. ముఖ్యంగా ఖయ్యం వంటి శక్తివంతమైన శాటిలైట్ల రూపకల్పనలోనూ రష్యా సహకారం ఇరాన్‌కు కొండంత బలంగా మారిందంటున్నారు. ఖయ్యం ఉపగ్రహం అందించే స్పష్టమైన చిత్రాల ఆధారంగా ఇరాన్ ప్రభావమంతంగా, శక్తిమంతంగా, సమర్ధవంతంగా అమెరికాపై క్షిపణిదాడులు నిర్వహించగలుగుతోందని చెబుతున్నారు. ఒక పోతే ఆయుధాల మార్పిడి విషయంలోనూ ఇరాన్, రష్యాల మధ్య ఉన్న బలమైన ఒప్పందం ఉందనీ, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ తన షాహిద్ డ్రోన్లను రష్యాకు భారీగా సరఫరా చేసిందనీ చెబుతున్నారు. కాగా యుద్ధ అనుభవాలతో రష్యా షాహిద్ డ్రోన్లను మరింత ఆధునీకరించిందనీ, ఏఐ, యాంటీ జామింగ్ టెక్నాలజీతో వీటిని మరింత మెరుగుపరిచి వాటిని తిరిగి ఇరాన్‌కు పంపిస్తోందనీ, ఈ ఆధునిక సాంకేతికతతో డ్రోన్లు శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను సులువుగా ఛేదిస్తున్నాయనీ, ఆ కారణంగానే అమెరికా అంచనాలు తప్పి ఇరాన్ గట్టిగా ప్రతిఘటించి అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కరి చేయలగులుగుతోందంటున్నారు.

Publish Date: Apr 1, 2026 11:31AM

political-news-img

అనుమతులు లేకుండానే చైనాలో యాపిల్ కొత్త ఫీచర్లు!

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన యాపిల్ ఇంటెలిజెన్స్'ఫీచర్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అధికారికంగా రెగ్యులేటరీ అనుమతులు రాకుండానే.. చైనాలోని కొంతమంది ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి రావడం కలకలం సృష్టించింది. సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని యాపిల్ చెబుతోంది. వెంటనే ఈ సేవలను నిలిపివేసినట్లు పేర్కొంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. చైనాలోని కొంతమంది ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఆక్టివేట్ అయినట్లు గుర్తించారు. వెంటనే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియా పోస్టు చేశారు. వెంటనే అవి తెగ వైరల్ అయ్యాయి. విదేశీ ఏఐ సాంకేతికతపై చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులో ఉన్నా.. ఎటువంటి అనుమతులూ లేకుండా ఈ ఫీచర్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింద. వాస్తవానికి చైనా మార్కెట్ కోసం యాపిల్ సంస్థ స్థానిక టెక్ దిగ్గజం అలీబాబాతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ హువావే, షావోమీ వంటి స్థానిక కంపెనీలు ఇప్పటికే ఏఐ ఫీచర్లతో దూసుకుపోతుండటంతో.. అక్కడి మార్కెట్ లో యాపిల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే త్వరగా సేవలు ప్రారంభించాలనే ఉద్దేంతో ఉంది. అయితే తాజాగా అనుమతులు లేకుండానే కొందరి ఫోన్లలో యాపిల్ ఏఐ ఫీచర్లు యాక్టివేట్ కావడం ఆ సంస్థకు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. టెక్నికల్ లోపంగా చెప్పి యాపిల్ ఆ సేవలను చైనాలో నిలిపివేసినప్పటికీ మార్కెటింగ్ పరంగా యాపిల్ చైనాలో కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గత ఏడాది నుంచే యాపిల్ ఏఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. చైనాలో మాత్రం చట్టపరమైన చిక్కుల వల్ల ఇంకా అందుబాటులోకి రాలేదు. చైనాలో ఎదురవుతున్న ఈ రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించుకుని, ఏఐ సేవలను యాపిల్ చైనాలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. యాపిల్ టెక్నికల్ ఎర్రర్ అని చెప్పినప్పటికీ ఈ విషయాన్ని చైనా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Publish Date: Apr 1, 2026 11:14AM

political-news-img

దేశంలోనే నంబర్ వన్ హైదరాబాద్!

విశ్వనగరం భాగ్యనగరం దేశంలోనే అత్యంత అనుకూల నివాసనగరంగా ఖ్యాతి దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలన్నిటినీ వెనక్కి నెట్టి, అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ప్రముఖ సంస్థ తాజాగా విడుదల చేసిన వి ఆర్ సిటీ - 2026' నివేదిక మేరకు దేశంలో అత్యంత అనుకూల నివాసనగరంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. పర్యావరణం, జీవన ప్రమాణాలు, ఆర్థిక వృద్ధి కారణంగా విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతలు, రవాణా సౌకర్యాలు, ఉపాధి అవకాశాల ప్రాతిపదికగా ఈ నివేదిక రూపొందింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరణతో పాటు స్టార్టప్‌లకు కేంద్రంగా మారడం నగర రూపురేకలను మార్చేసింది. నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతులు ప్రజల జీవనశైలిని మెరుగుపరిచాయని వీఆర్ సిటీ 2026 నివేదిక పేర్కొంది దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నివసించడానికి అయ్యే ఖర్చు సామాన్యులకు అందుబాటులో ఉండటం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండటం కూడా ఈ నగరం అత్యంత అనుకూల నివాసయోగ్యమైన నగరంగా నిలవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక పోతే ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్లు, మెట్రో రైలు విస్తరణ, లింక్ రోడ్లు కూడా హైదరాబాద్ ను అత్యంత అనుకూల నివాసయోగ్య నగరంగా మార్చాయి. అలాగే నగరం ఇప్పటికే ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గుర్తింపు పొందింది. పర్యావరణ పరిరక్షణలోనూ ముందుంది. గాలి నాణ్యత విషయంలోనూ ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ మెరుగ్గా ఉంది. ఇక పోతే విద్య, వైద్య రంగాల్లో హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వెరసి హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా హైదరాబాద్ మహానగరానికి ఈ గుర్తింపు రావడం వరుసగా ఇది ఆరోసారి. ఈ గుర్తింపుతో హైదరాబాద్ కు విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Apr 1, 2026 10:38AM

political-news-img

స్టీవ్ స్మిత్.. ఒక్కరోజులోనే తొమ్మిదిన్న కోట్ల ఆదాయం.. ఎలాగంటే..?

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. మైదానంలో పరుగుల వరద సృష్టించి రికార్డులు బ్రేక్ చేసే స్టీవ్ స్మిత్ వ్యాపారంలో కూడా అదే రీతిలో దూసుకెడుతున్నాడు. సరైన సమయంలోసరైన నిర్ణయం తీసుకుంటూ లాభాల పంట పండించుకుంటున్నాడు. తాజాగా స్టీవ్ స్మిత్ తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం అతడికి ఒక్క రోజులోనే కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. ఒక స్పోర్ట్స్ టెక్నాలజీ స్టార్టప్‌లో ఆయన చేసిన ఇన్వెస్ట్ మెంట్ విలువ అనూహ్యంగా పెరిగి.. కేవలం ఒకే ఒక్క రోజు లో స్మిత్ కు దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలను అతడి ఖాతాలో పడేలా చేసింది. విషయమేంటంటే.. గతంలో స్మిత్ ఒక చిన్న స్పోర్ట్స్ అనలిటిక్స్ కంపెనీలో వాటాలు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన పెట్టిన పెట్టుబడి విలువ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తాజాగా ఆ కంపెనీ మార్కెట్ వాల్యూయేషన్ విపరీతంగా పెరిగింది. దానికి తోడు కొత్త ఒప్పందాల కారణంగా ఆ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఎగిసింది. దీంతో స్మిత్ కొన్న షేర్ల వలువ అనేక రెట్లు పెరిగింది. స్టీవ్ స్మిత్ కంపెనీలో పెట్టిన షేర్ల విలువ ఒక్క రోజులోనే 1.2 మిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయల మేర ఎగబాకింది. కొన్నేళ్ల కిందట 50 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఈ ప్రయాణం.. ఈ రోజు తొమ్మిదిన్నర కోట్ల రూపాయల మార్కు దాటడం విశేషం. ఆస్ట్రేలియా క్రికెటర్లలో అత్యధిక నికర ఆస్తి కలిగిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ స్మిత్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాడు. సాధారణంగా క్రీడాకారులు రియల్ ఎస్టేట్ లేదా హోటల్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్మిత్ మాత్రం భవిష్యత్తు అవసరాలను గుర్తించి తెలివిగా టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్ చేశాడు. అంతే కాకుండా సరైన కంపెనీని ఎంచుకోవడంతో ఆయన భారీగా లాభపడ్డారు.

Publish Date: Apr 1, 2026 10:22AM

political-news-img

ఎస్పీ కార్యాలయంలో బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే.. పది గంటల హైడ్రామా

పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో ఏకంగా పది గంటల పాటు బైఠాయించి సంచలనం సృష్టించారు. పల్పాడు జిల్లా జిల్లా పోలీసు లీగల్ సలహాదారుగా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని వెంటనే నియమించాలంటూ ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి ఏకంగా పది గంటల పాటు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై తెలుగుదేశం అధిష్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయమేంటంటే.. పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం (మార్చి 31) ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు. ఆయన జరిపి ఉత్తర్వులిస్తానని చెప్పారు. అయితే ఎమ్మెల్యే చదలవాడ మాత్రం నియామక పత్రం చేతికిచ్చే వరకు కదిలేది లేదని ఎస్పీ ఛాంబర్‌లోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో ఆయన తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎస్పీ చాంబర్ లోనే కూర్చున్న ఎమ్మెల్యే ఒక దశలో ఆ చాంబర్ లోని బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లో మాట్లాడినా ఆయన బయటకు రాలేదు. దీంతో పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర తెలుగుదేశం నేతలు వచ్చి బుధవారం (ఏప్రిల్ 1) సాయంత్రంలోగా నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శాంతించారు. రాత్రి తొమ్మదిన్నర గంటల ప్రాంతంలో ఆయన తన నిరసర విరమించారు.

Publish Date: Apr 1, 2026 10:03AM

political-news-img

కూపర్ కనోలీ హీరోచిత పోరాటం.. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం (మార్చి 31) రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే తమ విజయాల ఖాతా తెరిచింది. పంజాబ్ విజయంలో యువ బ్యాటర్ కూపర్ కనోలీ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించి జట్టును గెలిపించాడు. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 39పరుగులు, జోస్ బట్లర్ 38 పరుగులతో ఓ మోస్తరుగా రాణించినా, పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో వారిని కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఒక దశలో సునాయాసంగా గెలిచేస్తుందనిపించినా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 37 పరుగులు చేసి ఒటైన తరువాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఒకానొక దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే యువ ఆటగాడు కూపర్ కనోలీ 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 72 నాటౌట్ తో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కీలక సమయంలో జేవియర్ బార్ట్‌లెట్ 5 బంతుల్లో 11 నాటౌట్ మెరుపులు మెరిపించడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. కనోలీ కేవలం 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీసినప్పటికీ, కనోలీ ఇన్నింగ్స్ ముందు అది వృధా అయింది.

Publish Date: Apr 1, 2026 7:36AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img