చేనేతలకు తెలుగుదేశం సర్కార్ ‘పవర్’ గిఫ్ట్.. రేపటి నుంచి ఉచిత విద్యత్ పథకం అమలు
ఆంధ్రప్రదేశ్లో చేనేత వర్గానికి చారిత్రాత్మకమైన భరోసా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేతలకు బుధవారం (ఏప్రిల్1) నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తీసుకువస్తున్నది. లక్షలాది మంది చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్కు నెలకు 500 యూనిట్ల వరకు ప్రభుత్వం విద్యుత్ను ఉచితంగా అందిస్తుంది. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి, చేనేతలకు మరింత అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93,000 మాగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.150 కోట్లు వెచ్చించనుంది. ఈ రాయితీ ద్వారా ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి ఏడాదికి రూ.8,640, అలాగే ప్రతి పవర్ లూమ్ యూనిట్ కు ఏడాదికి రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నేత వృత్తిలో విద్యుత్ ఒక అనివార్య ఖర్చుగా మారిన తరుణంలో, ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు నేతలకు గొప్ప సహాయం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే నేతన్నలకు ఇచ్చే పెన్షన్ను రూ.4 వేలకు పెంచింది . రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు కేటాయించింది. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90 శాతం రాయితీ కల్పిస్తోంది. ముడి సరుకులపై 15 రాయితీ ఇవ్వడంతో పాటు, నాణ్యమైన నూలు సరఫరాకు చర్యలు తీసుకుంది. చిన్న క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10.44 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటితో పాటు మార్కెటింగ్ సదుపాయం కోసం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల ద్వారా నేరుగా అమ్మకాలు జరిపేలా అవకాశం కల్పించింది. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నది.
Publish Date: Mar 31, 2026 5:26PM