ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్.. ఉగ్రవాదంపై భారత్ నయా వ్యూహం

posted on: Apr 29, 2026 8:22PM

బిష్కెక్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్పీవో) రక్షణ మంత్రుల సమావేశంలో భారత్ తన గళాన్ని గట్టిగా  వినిపించింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించే ప్రసక్తి లేదనీ.. ముఖ్యంగా పొరుగు దేశాల అండతో సాగుతున్న సీమాంతర  ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్  పాటించాల్సిందేనని భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు.  దేశ రక్షణ విషయంలో భారత్ అనుసరిస్తున్న నూతన వ్యూహాన్ని వివరిస్తూనే..  మరోవైపు చర్చలు,  అంతర్జాతీయ నిబంధనల పట్ల తమకున్న గౌరవాన్నీ చాటారు.  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చర్యలను ప్రస్తావిస్తూ..  గతంలో జరిగిన పహల్గాం దాడిని రాజనాథ్ సింగ్ గుర్తుచేశారు. అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ హత్యాకాండ మానవత్వానికే మచ్చగా రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. 

ఆ సంఘటన తర్వాత భారత భద్రతా సిద్ధాంతంలో వచ్చిన మార్పులను వివరిస్తూ.   ఆపరేషన్ సిందూర్  గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నా అవి సురక్షితం కావనీ..  భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో కొన్ని దేశాలు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిపై రాజనాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే ఆదేశంపై విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదానికి మతం, జాతి అనే భేదాలు ఉండవన్న ఆయన  దానిని సమర్థించుకోవడానికి ఎటువంటి సాకులు వెతకకూడదన్నారు. గతంలో కుదిరిన టియాంజిన్ డిక్లరేషన్‌ను ప్రస్తావిస్తూ, అప్పట్లో చేసిన తీర్మానాలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, వాటిని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత సభ్య దేశాలన్నింటిపై ఉందన్నారు. సామూహిక విశ్వసనీయత అనేది నిరంతర ఆచరణపైనే ఆధారపడి ఉంటుందని  ఉద్ఘాటించారు. 

భారత్ కేవలం కఠిన వైఖరినే కాకుండా, మానవీయ కోణాన్ని కూడా కలిగి ఉందని చెప్పిన రాజ్ నాథ్ సింగ్.. మహాత్మా గాంధీ సూక్తి కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్నే గుడ్డిగా మార్చేస్తుందని  ఉటంకిస్తూ.. వివాదాలు విపత్తులుగా మారకూడదనీ..  చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధాల వల్ల పేదలు, బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతారని, అందుకే సహజీవనం,  సహకారం అనే సూత్రాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  కఠిన భద్రత మరియు మృదువైన దౌత్యం  అనే రెండు విభిన్న అంశాలను భారత్ సమర్థవంతంగా సమన్వయం చేస్తోందని రాజనాథ్ సింగ్ వివరించారు. సైనిక శక్తిని బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని, ఇందుకోసం రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచినట్లు  వెల్లడించారు. సుమారు 7.85 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించడం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధ తంత్రం అంతా డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మరియు అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల చుట్టూనే తిరుగుతుందని, భారత్ ఆ దిశగా మల్టీ డొమైన్ ఆపరేషన్లకు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించారు.  రక్తం మరియు నీరు కలిసి ప్రవహించలేవు  అనే నినాదంతో ఇండస్ జలాల ఒప్పందంపై కూడా భారత్ పునరాలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్రదాడులను కేవలం భద్రతా పరమైన సమస్యగా కాకుండా, దేశ సార్వభౌమత్వంపై జరుగుతున్న దాడిగానే భారత్ పరిగణిస్తోందన్నారు. కాగా విశ్లేషకులు  దీనిని ఉగ్రవాదానికి వత్తాసు పలికే దేశాలపై హైడ్రోపాలిటికల్ ఒత్తిడిని పెంచడంగా పరిగణిస్తున్నారు.  మొత్తానికిఎస్సీఓ వేదికపై భారత్ తన భద్రతా విధానాన్ని మూడు ప్రధాన స్తంభాలపై నిలబెట్టింది: ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం, అంతర్జాతీయ నిబంధనల అమలు,  శాంతియుత సహజీవనం. ఉగ్రవాద కేంద్రాలకు ఎక్కడా రక్షణ  ఉండదని హెచ్చరిస్తూనే, ప్రపంచ దేశాల పట్ల కరుణతో కూడిన బాధ్యతాయుతమైన శక్తిగా భారత్ తనను తాను ఆవిష్కరించుకుంది. ఈ సమావేశం ద్వారా అంతర్జాతీయ సమాజానికి భారత్ ఒక స్పష్టమైన మరియు బలమైన సందేశాన్ని పంపింది.

- సీతారాం కంఠంనేని

References

https://timesofindia.indiatimes.com/defence/news/sco-summit-rajnath-singh-flags-state-sponsored-terrorism-warns-of-justifiable-punishment/articleshow/130574310.cms 
https://indianexpress.com/article/india/rajnath-singh-sco-meet-bishkek-terrorism-double-standards-china-russia-10660287/ 
https://www.theweek.in/news/defence/2026/04/28/operation-sindoor-showed-our-resolve-rajnath-singhs-sharp-message-to-pakistan-at-sco-ahead-of-op-sindoor-anniversary.html 
https://www.indiatoday.in/india/story/rajnath-singh-slams-pakistan-sco-meet-says-terror-hubs-no-longer-immune-to-action-2902608-2026-04-28 
https://www.devdiscourse.com/article/law-order/3889971-rajnath-singh-strengthens-strategic-defence-ties-with-central-asia-and-belarus-at-sco-meet 
https://www.indiandefensenews.in/2026/04/rajnath-singh-in-bishkek-for-sco.html 


ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తెలుగు వన్ ను ఫాలో అవ్వండి.. షేర్ చేయండి 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...