Latest News

క్రికెటర్ అశ్విన్‌కు యువరాజ్ తండ్రి క్లాస్.. ఎందుకో తెలుసా?

posted on: Mar 26, 2026 9:33AM

క్రికెట్ దిగ్గజం సచిన్‌‌టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ విషయంలో క్రికెట్ కోచ్ యోగ్‌రాజ్‌సింగ్ భారత్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్‌ను టార్గెట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్  తండ్రి  యోగ్‌రాజ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.  

తాజాగా ఆయన అశ్విన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆసక్తి రేపుతోంది.  2022లో యోగ్‌రాజ్ వద్ద అర్జున్ టెండ్కూలర్ శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ పొందాడు. అలానే రంజీ ట్రోఫీలో గోవాకు మారి సత్తా చాటడం ప్రారంభించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2026 వేలంలో అర్జున్‌ను లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌  30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

ఈ సీజన్‌లో అర్జున్‌కు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌  తుది జట్టులో చోటు  దక్కడం అసాధ్యమని.. అలానే ఒకవేళ చోటు దక్కినా అతడు రాణించడం అనుమానమేనంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై  యోగ్‌రాజ్‌ ఘాటుగా స్పందించారు. అశ్విన్ కు ఓ రేంజ్ లో  క్లాస్ పీకారు. టీవీల్లో కూర్చొని ఒకరి ప్రతిభను డిసైడ్‌ చేయడానికి అశ్విన్ కు ఉన్న అర్హత ఎంటంటూ నిలదీశారు.  

ఒక ప్లేయర్‌ను.. నువు చేయలేవు, నీవు ఆడలేవు, నీకు ఇది సాధ్యం కాదు అని మాట్లాడటం సరైంది కాదంటూ అశ్విన్‌కు  కౌంటర్ ఇచ్చారు. నిరుత్సాహ పరిచే ఇలాంటి మాటలు ఏ ఆటగాడిపై అయినా ఒత్తిడి పెంచుతాయన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ కుమారుడిగా  అర్జున్‌పై ముందు నుంచే ఒత్తిడి ఉందన్న యోగరాజ్..  ఇలాంటి వ్యాఖ్యలు అతన్ని మరింత ఒత్తిడిలోకి నెడతాయన్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అర్జున్‌కుతప్పక అవకాశాలు వస్తాయని, వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకుంటాడని  విశ్వాసం వ్యక్తం చేశాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...