పెళ్లికి కూడా పర్మిషన్ తీసుకోవాలేమో..ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ ఫైర్

posted on: May 19, 2026 9:39PM

 

 కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరకు దేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగుతూ కూటమి నేతలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రేపు పెళ్ళికి కూడా పర్మిషన్ తీసుకోవాలేమో అని మాట్లాడారు .మంగళవారం బి.మఠం మండల పరిధిలోని బోడపాడు గ్రామంలో పర్యటించిన ఆయన, అక్కడ జరుగుతున్న పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును  అవినాశ్‌ తీవ్రంగా తప్పుపట్టారు.

*​దేవుడితో పెట్టుకుంటే నాశనమే..
బోడపాడు గ్రామంలో గత వారం రోజులుగా శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుగుతుంటే, కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. ఉత్సవాలను నిర్వహిస్తున్న వైసీపీ నాయకులను వారం రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తే నాశనమైపోతారని, ఈ విషయాన్ని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలని ఎంపీ హెచ్చరించారు.

*​రేపు పెళ్లిళ్లకు కూడా అనుమతి తీసుకోవాలేమో?

గ్రామాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని అవినాష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వేధింపులు ఏ స్థాయికి చేరాయంటే.. రాబోయే రోజుల్లో ప్రజలు తమ ఇళ్లల్లో వివాహాలు చేసుకోవాలన్నా కూటమి నాయకుల అనుమతి తీసుకోవాలేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎద్దేవా చేశారు. కేవలం వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనే కక్షతోనే పోలీసులతో ఇబ్బందులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని, అరాచకాలను చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని ఎంపీ అన్నారు. ప్రతి దానికి రాజకీయం పూయడం, దేవుడి ఉత్సవాలను కూడా వివాదాల్లోకి లాగడం అత్యంత బాధాకరమన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నాయకులు భవిష్యత్తులో ప్రతి అక్రమానికి, వేధింపునకు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరించారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...