అవును మళ్ళీ వాళ్ళు పార్టీ మారారు

posted on: Jan 3, 2015 9:32AM

 

కడప జిల్లాలో కందుల సోదరులుగా పేరొందిన కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి ముచ్చటగా మళ్ళీ మరోసారి పార్టీ మారారు. ఒకసారి తెదేపాలోకి మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి మారుతుండే వారిరువురు ఎన్నికల సమయంలో వైకాపాలో చేరారు. కానీ వారు ఊహించినట్లు ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో, వారిరువురూ చెట్టాపట్టాలేసుకొని మళ్ళీ బీజేపీలోకి దూకేశారు. పోతూపోతూ వారిరువురూ వైకాపాకు ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేసారు. ఆపార్టీకి భవిష్యత్ లేదనే ఉద్దేశ్యంతోనే తామిరువురం పార్టీని విడిచిపెట్టేస్తున్నామని చెప్పారు. కానీ ఎన్ని పార్టీలు మారినా తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అందువలన ఇప్పుడు బీజేపీలో చేరితే తమకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే వారి నమ్మకాన్ని మెచ్చుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరిన పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి సీనియర్ నేతలను ఆ పార్టీ పక్కనబెట్టి ఆర్.యస్.యస్. నుండి రామ్ మాధవ్ ను పార్టీలోకి రప్పించి ఆయనకు పార్టీ కార్యదర్శి వంటి కీలకపదవిని కట్టబెట్టింది. అటువంటప్పుడు అనేక పార్టీలు మారి బీజేపీలోకి వచ్చిపడిన కందుల సోదరులు ఆ పార్టీ నుండి ఏమి ఆశించగలరు? ఏమీ దక్కకపోతే వారు ఆ పార్టీని అంటిపెట్టుకొని ఎంతకాలం ఉంటారు?

google-ad-img
    Related Sigment News
    • Loading...