167 సీట్లంట.. జగన్ ఆశకి అంతేలేదా?
posted on Jul 18, 2014 3:37PM
.jpg)
కాంగ్రెస్ పార్టీలో వుండగా ముఖ్యమంత్రి పదవి కోసం లొట్టలేసి మొదటికే మోసాన్ని తెచ్చుకున్న జగన్, ఎన్నికల ముందు కూడా అలాగే లొట్టలేసి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిపోయినట్టు కలలు కన్నారు. చివరికి అవన్నీ కల్లలైపోయి 67 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్నారు. అయితే ఆయనకి త్వరలో జైలు కూడు తప్పదని రాజకీయ ప్రత్యర్థులు అంటూ వుంటే, ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవి చుట్టూ మనసును తిప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్న చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ అర్జెంటుగా మళ్ళీ ఎన్నికలు వస్తే తాను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని కలలు కంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న విష ప్రచారం జనంలో పనిచేస్తోందని భ్రమపడుతున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తన పార్టీకి ఇప్పుడున్న 67 స్థానాలకు మరో వంద స్థానాలు కలసి మొత్తం 167 స్థానాలు వస్తాయని ఆయన భ్రమిస్తూ, ఆ భ్రమల్ని ప్రజలకు కూడా కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎక్కడ మైకు దొరికినా తన మనసులో వున్న 67 - 167 లెక్కని చెప్పకుండా వుండలేకపోతున్నారు. జగన్ బాబు ఆశిస్తున్నట్టు మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. ఒకవేళ పొరపాటుగా జగన్ ముచ్చట తీర్చాలని మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్కి ఇప్పుడున్న 67 స్థానాలు కూడా రావు. అంచేత జగన్ మళ్ళీ ఎన్నికలు జరగాలనే అనవసరపు స్టేట్మెంట్లు ఇవ్వకుండా గప్ చుప్గా వుండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబుకు సహకరిస్తే మంచిదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.