బాలకృష్ణ సచివాలయానికి అందుకే వచ్చేరుట!
posted on: Jun 10, 2015 10:00PM
![]()
ఈరోజు నందమూరి బాలకృష్ణ జన్మదినం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు అందరూ ఆయన జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకొన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జిల్లా మంత్రి పరిటాల సునీత ఆయనను సచివాలయంలో తన ఛాంబర్ కు ఆహ్వానించారు. జిల్లా నేతల సమక్షంలో కేక్ కట్ చేసి వారితో కలిసి ఆయన తన పుట్టిన రోజు వేడుకని జరుపుకొన్నారు.
కానీ అన్నిటినీ తన దృక్కోణం నుండే చూపిస్తూ ప్రజలను త్రప్పు ద్రోవపట్టించే అలవాటున్న వైకాపా ఆయన సచివాలయానికి రావడంపై కూడా చకచకా ఒక కధ అల్లేసి చేతిలో ఉన్న మీడియాతో జనాల మీదకు వదిలిపెట్టింది. వైకాపా నేత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డారు. కనుక నేడో రేపో ఆయనపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. కనుక చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేస్తే బాలకృష్ణ ఆ పదవి చేప్పట్టే ఉద్దేశ్యంతో ఉన్నట్లున్నారు. బహుశః అందుకే ఆయన సచివాలయంలో మంత్రులతో చర్చించేందుకు వచ్చేరేమో? చంద్రబాబు నాయుడు నేడు కాకపోతే రేపయినా రాజీనామా చేయక తప్పదు. కనుక ఆయన స్థానంలో మరొకరిని నియమించవలసి ఉంటుంది. కనుక తెదేపా మంత్రులతో ఆవిషయం గురించే చర్చిస్తే అందులో తప్పు లేదు,’ అని అన్నారు.
ఇంతకు ముందు ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి హరికృష్ణ, జూ.యన్టీఆర్ లని పార్టీ నుండి దూరం చేసినట్లే ఇప్పుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడని వైకాపా నేతలు ప్రచారం మొదలుపెట్టి తెదేపాలో అపోహలు, అనుమానాలు సృష్టించి మరొక మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లున్నారు. ఇటువంటి సమయంలో తెదేపా నేతలు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది.







.webp)


