విగ్రహాల గురించి ఇంత రచ్చ అవసరమా..?

posted on: Aug 3, 2016 12:38PM

 

ఒక పక్క ఏపీలో ప్రత్యేక హోదా గురించి రాష్ట్రమంతటా నిరసనలతో అట్టుడుకుతుంటే మరోపక్క విగ్రహాల తొలగింపుపై మరో రచ్చ జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపుపై రేగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. త్వరలో కృష్ణ పుష్కరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో రోడ్డు వెడల్పు చేసే పనిలో భాగంగా కావాలనే రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించింది ప్రభుత్వం. అంతే ఏపీ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలిగించిందని వైసీపీ పార్టీ నేతలు గగ్గొలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతగా.. ఏపీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి అనేక సేవలు చేశారని.. అలాంటిది ఆయన విగ్రహం తొలగిస్తారా అంటూ  విగ్రహాన్ని అక్కడే మళ్లీ ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేశారు.

 


ఇదిలా ఉండగా ఇప్పుడు వారి ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నట్టు చేసింది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతి-విజయవాడ రహదారిపై పాత అమరావతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. దీంకో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రోడ్లు వెడల్పు కోసం మా నేత విగ్రహం తొలగించారు.. ఇప్పుడు రోడ్డును తవ్వేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. ఆరోపించారు. దీనికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది.. తెలుగుదేశం నేతలు వారి ప్రాబల్యాన్ని చాటుకోవడానికే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


మరోవైపు ఏపీలో ఇన్ని సమస్యలు ఉంటే విగ్రహాల కోసం ఇంత దుమారం అవసరమా అంటున్నారు కొంతమంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇప్పుడు విజయవాడ రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు విజయవాడ ఒకటి.. ఇప్పుడు విజయవాడ పరిస్థితి వేరు. అసలే ఇరుకు రోడ్లు.. ట్రాఫిక్ కష్టాలు ఉంటే.. ఆ రోడ్ల మధ్యనే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు విగ్రహాలు పెట్టేస్తారు. ప్రభుత్వం అనుమతి తీసుకునేది ఏంటిలే అన్నట్టు వ్వవహరిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వారి పని వారు చేస్తుంటే మాత్రం అదో వివాదం చేస్తున్నారు. విగ్రహం తీసినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు.. విగ్రహం ఇంకోచోట పెట్టుకోవచ్చు.. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడైన నేతలు విగ్రహల గురించి కొట్టుకోవడం మానేసి.. ఆ సమయాన్ని ఏపీ అభివృద్ధికి కేటాయించటం మంచిది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...