Latest News

ఆస్తుల కోసం కాదు...న్యాయం కోసమే పోరాటం : షర్మిల

posted on: Mar 23, 2026 6:18PM

 

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరోసారి ముదిరింది. తన తల్లి వైఎస్ విజయమ్మ విడుదల చేసిన బహిరంగ లేఖపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కుటుంబ ఆస్తుల పంపకాల్లో తనకు, తన పిల్లలకు జరిగిన అన్యాయాన్ని తల్లి స్వయంగా లేఖ ద్వారా వివరించిన తర్వాత కూడా జగన్ మౌనంగా ఉండటం సరికాదని ఆమె పేర్కొన్నారు.

గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ ఆస్తుల రచ్చపై విజయమ్మ ఇటీవల ఒక నోటరీ చేసిన అఫిడవిట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంత వరకు ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేనని, వాటిని నలుగురు మనవలకు (జగన్ పిల్లలిద్దరు, షర్మిల పిల్లలిద్దరు) సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయమని ఆమె ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే జగన్ ఆ ఆస్తులను తన సొంత ఆస్తులుగా భావించి, చెల్లెలికి అన్యాయం చేస్తున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై షర్మిల స్పందిస్తూ.. "అమ్మ రాసిన ప్రతి అక్షరం నిజం. రాజశేఖర్ రెడ్డి గారి సాక్షిగా జరిగిన ఒప్పందాలను (MoU) జగన్ తుంగలో తొక్కారు. సరస్వతీ పవర్ వంటి ఆస్తుల్లో వాటాల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు" అని ఆరోపించారు. వైఎస్సార్ బతికి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, కనీసం ఇప్పుడైనా జగన్ తన తప్పు తెలుసుకోవాలని ఆమె హితవు పలికారు.

మరోవైపు, వైఎస్సార్‌సీపీ నేతలు విజయమ్మ లేఖపై భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ తన సోదరిపై ఉన్న ప్రేమతో ఇప్పటికే అధిక వాటా ఇచ్చారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే షర్మిల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు కొట్టిపారేస్తున్నారు. ఈ లేఖ వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉందనే అనుమానాలను కూడా అధికారికంగా కాకపోయినా పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

వైఎస్ కుటుంబంలోని ఈ అంతర్గత కలహాలు ఇప్పుడు బహిరంగం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆస్తుల గొడవ కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా, రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులు ఈ పరిణామాలతో తీవ్ర విచారంలో ఉన్నారు. రానున్న రోజుల్లో జగన్ ఈ లేఖపై నేరుగా స్పందిస్తారా లేదా కోర్టుల ద్వారానే తేల్చుకుంటారా అన్నది వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...